TG | కాళేశ్వరం ప్రాజెక్ట్ ను రద్దు చేయాల్సిందే – ఎమ్మెల్యే కూనంనేని

హ‌నుమ‌కొండ‌, ఆంధ్ర‌ప్ర‌భ : కేంద్ర ప్రభుత్వం మానవ హక్కులను(Human Rights ) ఉల్లంఘిస్తోందని, ఆపరేషన్ కగార్ ( Operation kagar ) పేరుతో కమ్యూనిస్టులను (Communists) లేకుండా చేయాలని కలలు కంటుంద‌ని సీపీఐ (CPI ) రాష్ట్ర కార్య‌ద‌ర్శి, కొత్త‌గూడెం (Kothsgudem ) ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు Kunamaneni )అన్నారు. శనివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కమ్యూనిస్టుల మృతదేహాలను చూసి కేంద్రం భయపడుతోందని, పోలీసుల కాల్పుల్లో చనిపోయిన నంబాల కేశవరావు మృతదేహాన్ని ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. మావోయిస్టులు తప్పు చేస్తే చట్టప్రకారం కేసులు పెట్టాలని, 2026 మార్చి నాటికి మావోయిస్టులను అంతం చేస్తామని చెప్పడం ఒక ఫ్యూడల్, గూండా, ఫాసిస్ట్ పాలనకు నిదర్శనం అని అన్నారు. మావోయిస్టులు లొంగిపోతామన్నా, చర్చలకు సిద్దం అని ప్రకటించినా హతమార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, కానీ ఒక్క నంబాల కేశవరావును చంపితే దేశంలో కోట్లాది మంది స్పందించారని, అదీ కమ్యూనిస్టులకు ఉన్న మానవతావాదానికి నిదర్శనం అని అన్నారు.

తుమ్మిడిహెట్టి ద‌గ్గ‌ర ప్రాజెక్టు క‌ట్టాలి
కూనంనేని మాట్లాడుతూ 140 మీటర్ల ఎత్తులో తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేశారు. అక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే అన్ని జిల్లాలకు సాగునీరు అందేదని చెప్పారు. కాళేశ్వరం నిర్మించాక ఒక చుక్కనీరు అదనంగా ఇవ్వలేదని, నేడు పంటలకు వచ్చేవి ఎల్లంపల్లి నీళ్లేనని తెలిపారు. గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, ప్రజలపై భారం మోపే కాళేశ్వరం ప్రాజెక్టును రద్దు చేయాలని అన్నారు. దాని నిర్వహణ కోసం ఏటా వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఇకపై కాళేశ్వరం కోసం ఖర్చు చేయొద్దు అని సూచించారు. కేసీఆర్ అంటే కాళేశ్వరం… కాళేశ్వరం అంటే కేసీఆర్ అన్నోళ్లు నేడు నోరు మూసుకున్నారని, తన మెదడును కరిగించి డిజైన్ చేశానని, కాళేశ్వరం కు అన్నీ తానే అన్న కేసీఆర్ ఇప్పుడు త‌న‌కు సంబంధం లేదంటున్నారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాధ్యత ఇంజనీర్ లదే అని నేడు తప్పించుకుంటున్నారని, ఇది అన్యాయమని అన్నారు. తుమ్మిడి హెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాజెక్టును మహారాష్ట్ర అనుమతి ఇవ్వలేదని, అందుకే కాళేశ్వరం కు మార్చామని హరీశ్‌ రావు అంటున్నారని, అలా అని జనాలను ముంచే ప్రాజెక్టు కడతారా అని ప్రశ్నించారు.

పేదలు లేని దేశంగా చూపాలని కుట్ర
భారతదేశం ఆర్ధికంగా జపాన్ ను దాటి నాల్గవ స్థానం ఆక్రమించిందని కేంద్ర సర్కార్ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ ప్రజలను మభ్య పెడుతుందని, కృత్రిమంగా పేదలు లేని దేశంగా చూపాలని ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. అర్థికంగా దేశం అభివృద్ధి చెందితే అసమానతలు ఎందుకు పోలేదని, ప్రజలు పేదరికంలో ఎందుకు మగ్గుతున్నారని ప్రశ్నించారు. ప్రతిరోజు రూ.280ల నుండి రూ.320లు సంపాదిస్తే పేదలు ధనవంతులుగా ఎలా మారుతారని ప్రశ్నించారు. నెలకు రూ.8వేలకు కుటుంబాన్ని ఎలా పోషించుకుంటారన్నారు. నెలకు 20వేల రూపాయల ఆదాయం ఉన్నా పేదవారుగానే పరిగణించాలని అన్నారు. బతుకుదెరువు లేకుండా అర్థాకలితో ప్రజలు జీవనం సాగిస్తున్నారని, ప్రపంచ దేశాలో ఆకలితో అలమటిస్తున్నవారిలో దేశం 101 స్థానంలో నిలిచిందని, ప్రజ లకు విద్య, వైద్యం కల్పించటంలో, కొనుగోలు శక్తిలో 124 స్థానంలో నిలిచినట్లు సూచికలు తెలుపుతున్నాయన్నారు. కేంద్రం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, వాస్తవాలను మరుగునపడేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, మాజీ జిల్లా కార్యదర్శి సిరబోయిన కరుణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *