హైదరాబాద్ : తొలకరి వర్షాలు ప్రారంభమై, ఖరీఫ్ సాగు పనులు ప్రారంభమైన తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు శుభవార్త అందించారు. రాష్ట్రవ్యాప్తంగా 70,11,984 మంది రైతులకు “రైతు భరోసా” పథకం కింద రూ. 8,931 కోట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ‘రైతు నేస్తం’ వేదికగా ముఖ్యమంత్రి మీట నొక్కి నిధుల విడుదల ప్రారంభించారు.
ఈ సందర్భంగా రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్స్కు అనుసంధానం చేశారు. ఈ విధంగా దాదాపు 6.4 లక్షల మంది రైతులు ఈ కార్యక్రమంలో ప్రత్యక్ష, ప్రత్యక్ష ప్రసారాల ద్వారా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం కల్పించామన్నారు. రైతు భరోసా పథకం ద్వారా 70 లక్షల మంది రైతులకు నేరుగా నిధులు జమ చేస్తున్నామని తెలిపారు. నిధులు ఈరోజు నుంచి తదుపరి 9 రోజులలోగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెప్పారు.