TG | నాంపల్లి కోర్టుకు హాజరైన సీఎం రేవంత్..
హైదరాబాద్,ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్, మెదక్ జిల్లాలోని కౌడిపల్లి, హైదరాబాద్లోని బేగం బజార్, తిరుమలగిరి, పెద్దవూర, కమలపూర్తో పాటు నల్గొండ టూటౌన్లో మొత్తం తొమ్మిది కేసులు రేవంత్ రెడ్డిపై నమోదయ్యాయి.
ఈ కేసుల్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అలాగే బీజేపీ రిజర్వేషన్లు తొలగిస్తుందంటూ గత ఎన్నికల్లో వీడియో సైతం విడుదల చేసిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు అయింది. ఆ సమయంలో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఉన్నారు. తనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.