TG | ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణకు చ‌ర్య‌లు చేప‌ట్టాలి – చందా లింగ‌య్య

అసెంబ్లీలో వ‌ర్గీక‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించిన మంత్రి సీత‌క్క‌
అసెంబ్లీలో ప్ర‌స్తావించినందుకు ద‌న్య‌వాదాలు
1994లోనే వ‌ర్గీక‌ర‌ణ బిల్లుకు ప్ర‌తిపాద‌న‌
ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రిమండ‌లి ఆమోదం
ఆదివాసీ, గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపకుడు చందా లింగ‌య్య‌

ఉమ్మ‌డి ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధ‌న‌స‌రి అన‌సూయ (సీత‌క్క‌) ప్ర‌క‌టించ‌డంప‌ట్ల మాజీ ఎమ్మెల్యే, ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్, ఆదివాసీ, గిరిజన అభ్యుదయ సంఘం వ్యవస్థాపకుడు చందా లింగ‌య్య దొర ద‌న్య‌వాదాలు తెలిపారు. ఈ మేర‌కు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆదివాసీ శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులు చొరవ తీసుకొని ఆదివాసీల వర్గీకరణకు చ‌ర్య‌లు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌కు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ప్ర‌భుత్వం ఆదివాసీల వ‌ర్గీక‌ర‌ణను ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అందరికంటే వెనుకబడిన జాతి ఆదివాసీ జాతి అని అన్నారు. మంత్రి సీత‌క్క కూడా ప్ర‌భుత్వాన్ని ఒప్పించి ఎస్టీ వ‌ర్గీక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.

రాజ‌కీయ‌ప్ర‌యోజ‌నాల ఆశించి…
కాంగ్రెస్‌, తెలుగుదేశం, బీఆర్ఎస్‌ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌ను ఆశించి గ‌తంలో కొంతమంది బీసీ లను ఎస్‌టీ జాబితాలో చేర్చి ఆదివాసీలకు తీరని అన్యాయం చేశార‌ని చందా లింగ‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏజెన్సీలో ఉన్న ఆదివాసీల ఆస్తులు, ఉద్యోగాలు, ఆర్థిక వనరులు, భూములు ఇతర ప్రాంతాల నుండి వలసలు వచ్చిన గిరిజనులు, గిరిజనేతరులు కాజేస్తున్నార‌ని అన్నారు.

1994లోనే వ‌ర్గీక‌ర‌ణ బిల్లుకు ప్ర‌తిపాద‌న‌
ఆదివాసి గిరిజన అభ్యుదయ సంఘం చేప‌ట్టిన ఉద్య‌మం త‌ర్వాత 1994లో గిరిజ‌న సంక్షేమ‌ శాఖ మంత్రి కొట్నాక భీమారావు చొర‌వ‌తో ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ సీఎం కోట్ల విజయ భాస్కర్ రెడ్డి మంత్రి మండ‌లిలో చ‌ర్చించి వ‌ర్గీక‌ర‌ణ‌కు ఆమోదించారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆదివాసీల వర్గీకరణ పై ఎవ్వరు కూడా పట్టించుకోకులేదు. రోజురోజుకూ ఆదివాసీలు దోపిడీకి గుర‌వుతున్నార‌ని, వారి జీవన విధానం దిగజారి పోతుంద‌ని, ఆదివాసీలు అభివృద్ధి చెందాలన్నా, వారి ఆర్థిక జీవన ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలంటే తక్షణమే వ‌ర్గీక‌ర‌ణ చేయాల‌ని కోరారు.

వ‌ర్గీక‌ర‌ణ‌కు ప్ర‌తిపాద‌న‌

  • ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలను ఒక్క గ్రూపుగా విభజించాలి
  • మైదాన ప్రాంత గిరిజనులను రెండో గ్రూపుగా విభజించాలి
  • జీవో ఎంఎస్ నెంబ‌ర్ 3ని పునరుద్ధ‌రించాలి
  • పీఈఎస్ఏ చట్టాన్ని మార్పులతో అమలు పరచాలి
  • భూ బదలాయింపు నిషేధ చట్టాలైన 1/59, 1/70 పటిష్టంగా అమలు చేయాలి
  • అటవీ హక్కుల గుర్తింపు చట్టం (ఆర్ఓఎఫ్ఆర్ -2006) ను అమలు చేయాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *