హైదరాబాద్ – జూబ్లీహిల్స్ (jubli hills ) అసెంబ్లీ స్థానానికి (assembly ) జరగనున్న ఉప ఎన్నికను తమ పార్టీ ఒక సవాలుగా తీసుకుంటోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు (ramachandra rao ) చెప్పారు. బలమైన ప్రతిపక్షం బరిలో ఉంటే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సాధించడం సాధ్యం కాదని ఆయన అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రానున్న 25 రోజుల్లోనే బీజేపీ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటిస్తామని రామచందర్రావు వెల్లడించారు. పార్టీలోని ముఖ్య నేతలతో చర్చించి, అన్ని సామాజిక వర్గాలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కొత్త కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. పార్టీలో ఎటువంటి వర్గాలు లేవని, అందరూ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఐక్యంగా పనిచేస్తారని ఆయన వివరించారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ పెద్దగా దృష్టి సారించలేదని, అయితే ఈసారి వాటిపైనా ప్రత్యేకంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆయన తెలిపారు.