హైదరాబాద్, ఆంధ్రప్రభ : కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో భూమి పూజ చేసిన స్థలంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని నిర్మించడానికి సహకరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడుకి బండి సంజయ్ లేఖ రాశారు. గత రెండు సంవత్సరాలుగా వాయిదా పడిన ఓ ముఖ్యమైన విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకురావాలని అనుకున్నట్లు తెలిపారు.
2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాలో పద్మనగర్లో పది ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించిందని పేర్కొన్నారు. 2023 మే 31న రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధుల సమక్షంలో భూమి పూజ కూడా నిర్వహించినట్లు వెల్లడించారు. కానీ దురదృష్టవశాత్తు ఆలయ నిర్మాణంలో ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. కరీంనగరే కాదు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని వివరించారు.