TG Assembly తెలంగాణ‌కు రైతే గుండెకాయ‌ …. ప్ర‌గ‌తి వైపు రాష్ట్రం ప‌య‌నం – గవర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ

రైతుల అభివృద్ధికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు
ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ రూప‌క‌ల్ప‌న‌
సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డిన ప్ర‌భుత్వం
యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగు
రాష్ట్ర గీతంగా జననీ జయకేతనం
స‌చివాలంయ‌లో తెలంగాణ త‌ల్లి ఏర్పాటు
అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ‌
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళ‌న‌
నిర‌స‌న‌ల మ‌ధ్య కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం
అసెంబ్లీ స‌మావేశాలు రేపటికి వాయిదా

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ‌కు రైతులు గుండెకాయ వంటి వార‌ని, వారి అభివృద్ధికి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. బుధ‌వారం నుంచి తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్ ప్రవేశపెడుతోందన్నారు. ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని పేర్కొన్నారు. త‌మ‌ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉంద‌ని, అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యం, రైతులు, మహిళలు, యువతకు అన్నివిధాలా సహకారం అందిస్తామ‌ని చెప్పారు. రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. గ‌వ‌ర్న‌ర్ చేత రాష్ట్ర ప్ర‌భుత్వం అబ‌ద్ధాలు చెప్పిస్తున్నార‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళ‌న మ‌ధ్య గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌సాగింది. గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ప్ర‌సంగం అనంతరం అసెంబ్లీని గురువారానికి వాయిదా వేశారు

ఘ‌న‌మైన సంస్కృతికి నిల‌యం…
ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ అని గ‌వ‌ర్న‌ర్ జిష్ణుదేవ్ వ‌ర్మ అన్నారు. ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశార‌ని గుర్తు చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నామ‌న్నారు. సామాజిక న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని చెప్పారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నామ‌న్నారు.

అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు
అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. రాష్ట్రానికి రైతులే ఆత్మ వంటి వారు అని, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామ‌న్నారు. ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉంద‌ని చెప్పారు. దేశంలో అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్టు తెలిపారు. ఇదే త‌మ‌ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శన‌మ‌ని చెప్పారు. 23.35 లక్షల మంది కర్షకులకు ప్రయోజనం కల్పించామ‌ని అన్నారు. ఎకరానికి రూ.12 వేల చొప్పున వారికి అందిస్తున్నామ‌న్నారు. రైతు నేస్తం అమలు చేస్తున్నామ‌న్నారు. స‌న్నాలు పండించే వ‌రి పంట‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్నామ‌ని వెల్ల‌డించారు. అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఆరోగ్య శ్రీ పరిధిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచామన్నారు. పాడి రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని,

మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న‌
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకం గేమ్‌ ఛేంజర్‌గా మారిందని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. ఆర్టీసీకి ఆరు వంద‌ల బ‌స్సులు అద్దెకు ఇచ్చే విధంగా మ‌హిళ‌ల‌ను ప్ర‌భుత్వం ప్రోత్స‌హించింద‌న్నారు. పేదలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తన ప్రసంగంలో పేర్కొన్నారు. రుణమాఫీ కోసం ఏకంగా రూ. 25 వేల కోట్లు ఖర్చు చేశామని, రూ. 500కే గ్యాస్ అందజేస్తున్నట్లు తెలిపారు.

యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు మెరుగు
యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ఏర్పాటు చేసినట్లు గ‌వ‌ర్న‌ర్ తెలిపారు. ప్యూచర్ సిటీ నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని వివరించారు. శ్రీశైలం – సాగర్ హైవే మధ్యలో ఉన్న ప్రాంతాన్ని దీనికి కేటాయించామన్నారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని, మెట్రో రైలు సౌకర్యం కూడా రాబోతుందని తెలిపారు. విద్యా రంగాన్ని కీలక బాధ్యతగా తీసుకుని ముందుకు సాగుతోందన్నారు.

సామాజిక న్యాయానికి క‌ట్టుబ‌డిన ప్ర‌భుత్వం
రాష్ట్రంలో సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంద‌ని గ‌వ‌ర్న‌ర్ అన్నారు. బీసీల రిజర్వేషన్ల కోసం కుల గణనను నిర్వహించామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై నివేదికకు కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని, దీని ఆధారంగా ఉద్యోగాల భర్తీ విషయంలో పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. ఇందుకోసం టీజీపీఎస్సీని బలోపేతం చేశామని తన ప్రసంగంలో గవర్నర్ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *