ఆడబిడ్డలు తలుచుకుంటే వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను సాధించడం కష్టం కాదని సీఎం రేవంత్ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
హైదరాబాద్ కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కొత్త భవనాల నిర్మాణం, చారిత్రక నిర్మాణాల పునరుద్ధరణతో సహా మొత్తం రూ.550 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను సీఎం రేవంత్ ప్రారంభించారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. సికింద్రబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో నిలబడ్డారని… మహిళలు కోరుకున్న మార్పు ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో కనిపిస్తోందని అన్నారు.
కేసీఆర్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఆడబిడ్డలు ఆశీస్సులతోనే తెలంగాణలో చంద్రగ్రహణం తొలగిపోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఐలమ్మ విశ్వవిద్యాలయం విద్యార్థులు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అవకాశం దొరికితే మహిళలు తమను తాము నిరూపించుకుంటున్నారని, వారిని ప్రోత్సహించడానికి తమ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు.
వ్యాపారరంగంలో అదానీ, అంబానీలతో రాష్ట్ర మహిళలు పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. మహిళల అభివృద్ధి కోసమే స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో వెయ్యి మంది ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సులకు ఓనర్లు కాబోతున్నారని తెలిపారు.
మహిళా సంఘాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడేలా చేస్తామన్నారు. 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. పాఠశాలల నిర్వహణ, బడి పిల్లలకు కోటి 30లక్షల జతల యూనిఫామ్ కుట్టించే పని మహిళలకే అప్పగించాం అని తెలిపారు. జిల్లా కేంద్రాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు కేటాయించాం.
సోలార్ ఉత్పత్తిలో అంబానీ, ఆదానీలతో మన ఆడబిడ్డలు పోటీ పడేలా తయారవుతారని పేర్కొన్నారు. మహిళల సంక్షేమం, అభివృద్ధి కోసం సీతక్క, కొండా సురేఖ పనిచేస్తున్నారు. ఇందిరమ్మ, ప్రతిభా పాటిల్, సోనియమ్మ ఆశీర్వాదంతో ప్రియాంక గాంధీ కూడా చట్టసభలో ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం ముఖ్యమంత్రి పెరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు.