శ్రీశైలం దేవస్థానంలో చెంచుగిరి జనులకు ఉచిత స్పర్శదర్శనం…

శ్రీశైలం దేవస్థానంలో చెంచుగిరి జనులకు ఉచిత స్పర్శదర్శనం…

ట్రస్ట్ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన గిరిజనులకు ప్రతీ నెలలోనూ ఒకరోజున చెంచుగిరిజనులకు ప్రత్యేకంగా ఉచిత స్పర్శదర్శనం కల్పించాలని ఫస్ట్ బోర్డు సమావేశంలో నిర్ణయించడం జరిగిందని ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పోతు గుంట రమేష్ నాయుడు కార్యనిర్వాహణాధికారి శ్రీనివాసరావు బుధవారం తెలిపారు.

గత నెలలో ముక్కోటి ఏకాదశి రోజున ఈ కార్యక్రమం ప్రారంభించబడిందన్నారు. ప్రతీ నెలలో కూడా చివరి బుధవారం రోజున చెంచు గిరిజన భక్తులకు ఈ ఉచిత స్పర్శదర్శనాన్ని కల్పించడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా చెంచు భక్తులకు శ్రీస్వామివార్ల స్పర్శదర్శనం ఉచితంగా దర్శించుకున్నారు. స్థానిక మేకలబండ, హాటకేశ్వరం, సున్నిపెంటలోని చెంచుభక్తులతో పాటు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం హనుమాపురం తాండ, మాచర్ల మండలం బోధనంపాడు, దుర్గి మండలం తేరాల నుంచి కూడా చెంచు భక్తులు శ్రీస్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన చెంచు గిరిజనులకు దేవస్థానం ఉచిత వసతి, అల్పాహార, భోజన సదుపాయం కల్పించింది. అదేవిధంగా దర్శనానంతరం చెంచు భక్తులందరికీ దేవస్థాన అన్నపూర్ణా ప్రసాదవితరణ భవనంలో అన్నప్రసాదాలు ఏర్పాటు చేయబడ్డాయన్నారు. బుధవారం ఉదయం చెంచుగిరిజన భక్తులు సంప్రదాయబద్దంగా తప్పెట వాయిద్యాలతో, చెంచు నృత్యాలతో దర్శనానికి విచ్చేశారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థానం అధికారులు వారికి ఆహ్వానం పలికారు.
చెంచు భక్తులు శ్రీ భ్రమరాంబాదేవివారిని తమ కూతురిగా, శ్రీ మల్లికార్జునస్వామివారిని తమ అల్లునిడిగా భావిస్తారన్నారు.

దేవస్థానంలో జరిగే ఆయా ఉత్సవాలలో గ్రామోత్సవం నందు ప్రత్యేకంగా చెంచుల సంప్రదాయ నృత్యాలను దేవస్థానం ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు. అలాగే సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో దివ్య కల్యాణమహోత్సవానికి చెంచు భక్తులను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిందన్నారు. శ్రీస్వామివారి ఉచిత స్పర్శదర్శనానికి చెంచుగిరిజన భక్తులను ఎంపిక చేయడంలో స్థానిక ఐ.టి.డి.ఏ ప్రాజెక్టు అధికారి సహకారాన్ని తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమములో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply