Telugu Desam | క‌డ‌పలో పసుపు శోభ – మహానాడు షురూ

ఆంధ్రప్రభ, కడప బ్యూరో : కడప జిల్లా చరిత్రలో తొలిసారి తెలుగుదేశం పార్టీ మహానాడుకు వేదికైంది. రాయలసీమ జిల్లాల నడిబొడ్డున కడప వేదికగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహణకు సర్వం సిద్ధమైంది . ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా పూర్తయ్యాయి. కడప నగరం మొత్తం పసుపు తోరణాలు, పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయి, పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ మ‌హానాడు 40 వేల కు మందికిగా పైగా తెలుగుదేశం ప్రతినిధులు పాల్గొన‌నున్నారు.

ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమం… కార్యకర్తలకు పెద్దపీట వేయడంతో పాటు పలు చరిత్రాత్మక నిర్ణయాలకు వేదికగా నిలవనుంది. తొలిరోజు 27న పార్టీ ప్రతినిధుల సభ, సంస్థాగత నిర్మాణం, భవిష్యత్తు కార్యాచరణతో పాటు టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, మంత్రి లోకేశ్‌ ప్రతిపాదించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియామవళిలో సవరణలపై ప్రధాన చర్చ జరగనుంది.

అలాగే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సంస్థాగత బలోపేతం, యువతకు, మహిళలకు ప్రాధాన్యం వంటి అంశాలపై ప్రధానంగా తీర్మానాలు ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా రాయలసీమ అభివృద్ధి, కడప జిల్లాకు సంబంధించిన ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వంటి అంశాలపై కీలక ప్రకటనలు వెలువడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి. గతంలో రాయలసీమ అభివృద్ధికి పాటుపడింది తెలుగుదేశం పార్టీయేనని, ఈసారీ ఈ ప్రాంత అభివృద్ధికి పెద్దపీట వేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే షెడ్యూల్ ..

ఇక మ‌హానాడులో భాగంగా మంగళవారం ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో పసుపు పండగ ప్రారంభమవుతుంది. అనంతరం ఫొటో ఎగ్జిబిషన్‌, రక్తదాన శిబిరాలు ప్రారంభించనున్నారు. ఉదయం 10.45 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు వేదికపైకి చేరుకుంటారు. పార్టీ జెండాను ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలన చేసి, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తారు. అనతరం ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపనతో మహానాడు లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పార్టీ కోసం పనిచేసి మృతిచెందిన కార్యకర్తలు, నేతలకు సంతాపం తెలియజేస్తారు. తర్వాత ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తారు. 11.30 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్వాగతోపన్యాసం చేస్తారు. కోశాధికారి పార్టీ జమాఖర్చుల నివేదిక సమర్పిస్తారు. 11.50 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేస్తారు.

తొలి రోజు చ‌ర్చించే అంశాలివే ..

ఇక తొలి రోజుల‌న టీడీపీ మౌలిక సిద్ధాంతాలపై చర్చించనున్నారు. స్వర్ణాంధ్ర సాధన, పార్టీ నిర్వహణ, మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ రూపొందించిన 6 సూత్రాల ఆవిష్కరణ, పార్టీ నియమావళిలో సవరణలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. మండల స్థాయిలో మూడు విడతలు ఒకే పదవి చేసిన వారిని అంతకన్నా పెద్ద పదవికి పంపాలన్న నిర్ణయంతో పాటు పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. భోజన విరామం తర్వాత ఆరు సూత్రాల్లో మొదటిదైన ‘కార్యకర్తే అధినేత’ , రెండోదైన ‘యువగళం’లో అంశంపై చర్చ జరుగుతుంది. మై టీడీపీ యాప్‌తో పాటు కార్యకర్తల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చిస్తారు. సాయంత్రం ఆరు సూత్రాల్లో రెండోదైన యువగళం అంశంపై చర్చ ఉంటుంది. ఇందులో భాగంగా యువత సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ- వెనుకబడిన ప్రాంతాలపై శ్రద్ధ, ప్రజా పాలనలో సాంకేతిక విజ్ఞానం-వాట్సప్ గవర్నెన్స్పై చర్చలు జరగనున్నాయి.

రెండోరోజు కార్యక్రమాలు…

రెండో రోజు బుధవారం ప్రతినిధుల సభతో పాటు పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ 102వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించనున్నారు. అనంతరం ఆరు సూత్రాల్లో మూడోదైన ‘తెలుగుజాతి- విశ్వఖ్యాతి’, నాలుగోదైన ‘స్త్రీ శక్తి’, ఐదో అంశం ‘సామాజిక న్యాయం – పేదల ప్రగతి’, చివరిదైన ‘అన్నదాతకు అండ’గాపై చర్చించి, తీర్మానాలు చేస్తారు. సాయంత్రం 5.30కు పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక, ప్రమాణ స్వీకారం, అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి.

మూడో రోజు భారీ బహిరంగ సభ

మహానాడులో మూడోరోజు 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు తెలుగుదేశం కసరత్తు చేస్తోంది. 27, 28 తేదీల్లో ప్రతినిధుల సభ, వివిధ తీర్మానాలపై చర్చ, ఆమోదం తెలపనుండగా 29న బహిరంగ సభ మాత్రమే జరగనుంది. మూడో రోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు 5 లక్షలమందితో భారీ బహిరంగసభ నిర్వహిస్తారు. .

భారీగా ఏర్పాట్లు

మహానాడు వేదిక దాదాపు పూర్తయింది. సువిశాల మైదానంలో తొలి రెండురోజులు ప్రతినిధుల సభ, చివరిరోజు బహిరంగ సభ, భోజనశాల, ముఖ్యమంత్రి సభ, ఆయన క్యాంపు కార్యాలయం ఇలా అన్నింటినీ సిద్ధం చేశారు. ప్రతినిధుల సభా వేదికపై దాదాపు 450 మంది కూర్చోనే విధంగా 164 అడుగుల వెడల్పున, 510 అడుగుల పొడవుతో నిర్మించారు. కింద 25వేల మంది కూర్చుని చర్చించేలా ఏర్పాట్లు చేశారు. ఇక ఏక‌కాలంలో 10 వేల‌కు మందికి పైగా భోజ‌నాలు చేసేందుకు వీలుగా అతి పెద్ద డైనింగ్ హాలు ను ఏర్పాటు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *