- ఏసీబీ విచారణలో కేటీఆర్
- రాజకీయంగా వివాదమా?
- మనీ లాండరింగ్ జరిగిందా
- అవినీతి చోటుచేసుకుందా
- మంత్రిగా కేటీఆర్ చేసిన తప్పేంటి
- ఈ-రేస్తో హైదరాబాద్కు మరింత ప్రతిష్ట
- ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించిన తెలంగాణ
- విశ్వనగరిలో ఈ ప్రిక్స్ నిర్వహణతో ఎంతో మేలు
- ఈ ప్రిక్స్ని ఈ-పిక్స్గా ఎందుకు మార్చేశారు?
- ఉత్కంఠ రేపుతున్న బీఆర్ఎస్ నేత విచారణ
- ఒక్కసారి కాదు.. వందసార్లు పిలిచినా వస్తానంటున్న కేటీఆర్
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలో రాజకీయ ఉత్కంఠత నెలకొంది. పొలిటికల్ వర్గాల్లో సస్పెన్స్ థ్రిల్లర్, ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సోమవారం ఉదయం 9 గంటలకు నందినగర్లోని తన నివాసం నుంచి ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ బయల్దేరారు. కేటీఆర్ వెంట అడ్వొకేట్ రామచందర్ రావు ఉన్నారు. కేటీఆర్ను విచారిస్తున్న సందర్భంగా బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 400 మంది పోలీసులు అక్కడ విధులు నిర్వహిస్తున్నారు. అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నాయకులను , కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.
అసలీ కేసు కథేంటీ..
2024 అక్టోబర్ 18న జరిగిన ఫార్ములా –ఈ కార్ రేస్ ఒప్పందం ప్రకారం ₹54.88 కోట్ల మేరకు అవకతవకల చోటు చేసుకున్నాయని , ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. దాన కిషోర్ ఏసీబీ కి ఫిర్యాదు చేశారు. మంత్రి మండలి ఆమోదం , ఆర్థిక శాఖ అనుమతులు లేకుండా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా ఫార్ములా -ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ కి చెల్లింపు జరిగిందని ఫిర్యాదులో ఆరోపించారు.
మాజీ మంత్రి కేటీఆర్పై కేసు ఏసీబీ నమోదు చేయడానికి 2024న డిసెంబర్ 16, గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 18న సాయంత్రం 5.30 గంటలకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 19, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంఎయూడీ విభాగం అరవింద్ కుమార్, హెచ్ఎండిఎ మాజీ చీఫ్ ఇంజనీర్ బి.ఎల్.ఎన్. రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.
ఒక రోజు తర్వాత, డిసెంబర్ 20న, ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇడి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు సమాచార నివేదిక (ఇసిఐఆర్)ను నమోదు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్ కు 2025 జనవరి 6,న ఏసీబీ సమన్లు జారీ చేసింది. మాజీ మంత్రితో న్యాయవాది రాకకు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఏసీబీ ఎదుట హాజరుకాకుండానే మాజీ మంత్రి వెనుతిరిగారు. జనవరి 9న హాజరు కావాలని ఆయనకు కొత్త నోటీసు జారీ చేశారు.
ఈ కేసులో నిందితులు అధికారులను కూడా ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 7 హాజరు కావాలని మంత్రిని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కోరింది. అధికారులు అరవింద్ కుమార్, బీఎల్ఉన్ . రెడ్డిని వరుసగా జనవరి 2, 3 తేదీల్లో హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. అధికారుల అభ్యర్థన మేరకు, ఈడీ కొత్త తేదీలతో – జనవరి 16 న కేటీఆర్ జనవరి 8న బీఎల్ఎన్ రెడ్డి, జనరవి 9న అరవింద్ కుమార్ హాజరు కావాలని ఈడీ సమయం ఇచ్చింది.
హైదరాబాద్ చరిత్రలోనే తొలి – ఈ రేస్ ఈవెంట్
బ్రిటన్ కు చెందిన ఎఫ్ఈవో , తెలంగాణ ప్రభుత్వ పట్టణాభివృద్ధి విభాగం, ఏస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ (గ్రీన్కో గ్రూప్ అనుబంధ సంస్థ స్పాన్సర్) మధ్య హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్ల కోసం ఫార్ములా- ఈ రేసులను నిర్వహించడానికి 2022న అక్టోబర్ 25 న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. హైదరాబాద్ చెందిన గ్రీన్కో సంస్థ ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 11 న ( ఫార్ములాఈ రేస్ – 2023) ఈ -ప్రిక్స్ను నిర్వహించిన మొదటి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించింది.
రాష్ట్ర ఎలక్ట్రికల్ వెహికల్ రంగం సామర్థ్యాన్ని హైలైట్ చేయడానికి ఫిబ్రవరి 5 నుంచి 11 మధ్య చేపట్టిన హైదరాబాద్ ఈ -మొబిలిటీ వీక్ ముగింపుగా ఇది జరిగింది. హుస్సేన్ సాగర్ సరస్సును చుట్టూ ఒక వ్యూహాత్మక ప్రదేశంలో ఒక సిటీ సర్క్యూట్ను ఏర్పాటు చేశారు. 30,000 మందికి పైగా ప్రేక్షకులు ఈ రేస్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హెచ్ఎండీఏ ₹12 కోట్లు ఖర్చు చేసిందని ఏసీబీ తన ఫిర్యాదులో పేర్కొంది
గ్రీన్కో వెనకడుగు
ఎఫ్ ఈవోతో విభేదాలతో స్పాన్సర్ క్రీడా ప్రదర్శన నుండి గ్రీక్ కో వెనక్కి తగ్గింది, తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమానికి ప్రాయోజిత నిర్వహణ పాత్రను చేపట్టడానికి నిధులను సమీకరించేందుకు సిద్ధపడింది. హెచ్ఎండీఏ కి రెండు ఇన్వాయిస్లు వచ్చాయి – ఒకటి సెప్టెంబర్ 25, 2023న, సీజన్ 10 ప్రమోటర్ ఫీజు గా మొదటి విడత ‘ కోసం £ 22,50,000 (₹22.69 కోట్లు) వర్తించే పన్నులు కమిషన్) ఇవ్వటం. సెప్టెంబర్ 29, 2023న, సీజన్ 10 ప్రమోటర్ ఫీజు రెండవ విడత కోసం £22,50,000 (₹23.01 కోట్లు ప్లస్ వర్తించే పన్నులు కమిషన్) కోసం అంగీకరిస్తూ అక్టోబర్ 3, అక్టోబర్ 11 తేదీలలో వరుసగా, హెచ్ఎండీ చీఫ్ ఇంజనీర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఈ మొత్తాలను హిమాయత్నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖలో ఎ ఫ్ఈవోకి బదిలీ చేశారు.
అనుమతులు లేని చెల్లింపులే : ఏసీబీ ఆరోపణ
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (అక్టోబర్ 9, 2023 నుండి డిసెంబర్ 4, 2023 వరకు) అమలులో ఉన్నప్పుడు, భారత ఎన్నికల కమిషన్ ముందస్తు అనుమతి లేకుండా ఈ చెల్లింపులు జరిగాయని ఏసీబీ తన ఫిర్యాదులో పేర్కొంది . విదేశీ ఖాతాల్లో చెల్లింపుల ఫలితంగా హెచ్డీఏకి ₹8.06 కోట్ల అదనపు పన్ను భారం పడింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ( ఎఫ్ఐఏ) ఆధీనంలోని ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు ₹1.10 కోట్ల మొత్తాన్ని అదనంగా చెల్లించారు – ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ ఫీజు పర్మిట్ ఫీజు వెరశి ₹54.88 కోట్లను హెచ్ఎండీఏ చెల్లించింది.
ఎఫ్ఈవో ఇమెయిల్ కమ్యూనికేషన్ తో అక్టోబర్ 27న, 2022 అక్టోబర్ 25 నాటి ప్రారంభ ఒప్పందాన్ని రద్దు చేసింది. 2023 అక్టోబర్ 30 న సీజన్ 10 కోసం కొత్త ఒప్పందంపై రాష్ట్ర పట్టణాభివృద్ధి సంస్థ, ఎఫ్ఈవో సంతకం చేశాయి, ఇందులో రాబోయే మూడు సంవత్సరాలకు అదనపు పునరావృత వ్యయంతో పాటు దాదాపు ₹600 కోట్ల ఆర్థిక లావాదేవీలకు అంగీకరించాయి. ఈ ఒప్పందంలో, తెలంగాణ ప్రభుత్వం £ 90,00,000 (₹90 కోట్లు) స్పాన్సర్ రుసుమును చెల్లించడమే కాకుండా, పౌర లాజిస్టిక్ మద్దతును అందించే భారాన్ని కూడా భరించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 2023లో రాష్ర్ట పట్టణాభివృద్ధి సంస్థ తన ‘హోస్ట్ సిటీ ఒప్పందాన్ని నెరవేర్చకూడదని నిర్ణయించింది. ఫలితంగా తర్వాత ఫిబ్రవరి 10, 2024న హైదరాబాద్ లో జరగాల్సిన రెండవ ఫార్ములా రేసు నిర్వహణను రద్దు చేశారు. హైదరాబాద్ ఈ ప్రిక్స్ (రౌండ్ 4) ను రద్దు చేస్తున్నట్టు జనవరి 7న, ఎఫ్ఈవో అధికారికంగా ప్రకటించింది. మెక్సికో సిటీ హాంకూక్ కు ఈ-ప్రిక్స్ వేదిక మారింది.
వందసార్లు పిలిచినా వస్తానన్న కేటీఆర్..
అక్రమ కేసులకు భయపడేది లేదని చెప్పిన కేటీఆర్ ఈ కేసులో అవసరం అయితే తనను అరెస్టు చేస్తారని కూడా కామెంట్ చేశారు. ఇలాంటి కేసులు పెట్టి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పైశాచిక ఆనందం పొందుతోందని ఆరోపించారు. ఆరు నెలల నుంచి విచారణ జరుపుతున్నారని ఏం తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు. ఎన్నిసార్లు, ఎప్పుడు పిలిచినా ధైర్యంగా హాజరై నిజమే చెబుతానని అన్నారు. తమకు చట్టాలు, కోర్టులపై గౌరవం ఉందన్న కేటీఆర్…. వెయ్యిసార్లు విచారణలకు పిలిచినా అరెస్టులు చేసినా తగ్గేదేలేదు అన్నారు.
అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. జైలు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఇంత కాలయాపన లేకుండా నేరుగా లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధపడితే సరిపోతుందని సవాల్ చేశారు. ప్రజల ముందు ఆ టెస్టు చేస్తే ఎవరు ఎలాంటి వ్యక్తులతో తేలిపోతుందన్నారు.
కాంగ్రెస్, బీజేపీవి దొంగనాటకాలు ఆడుతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కేసులు పెట్టి సతాయిస్తున్నారని ఆరోపించారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చేశారని దుయ్యబట్టారు. 420 గ్యారెంటీలు, హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు. వాటిపై ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని చేసినా కేసీఆర్ సైనికులను అడ్డుకోలేరని వార్నింగ్ ఇచ్చారు.