TDP | ఏపీలో స‌ప‌రిపాల‌న‌ .. జులై 2 నుంచి ఇంటింటికీ వెళ్దాం : నేతలకు చంద్రబాబు పిలుపు

మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజ‌లతో మ‌మేకం అవ్వాలి
పనితీరు తప్పకుండా మార్చుకోవాలి
లేకుంటే అంతే సంగతులు
ఇక నిత్యం ఎమ్మెల్యేలతో మాట్లాడుతా
ఎప్పటికప్పుడు సర్వే చేయిస్టున్నా
కొందరు బాగానే పని చేస్తున్నారు
ఇంకా పనితీరు బాగా మెరుగు పడాలి
పార్టీ నేతలతో సీఎం చంద్రబాబు విస్తృత స్థాయి సమావేశం

మంగ‌ళ‌గిరి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం.. ఎట్టి పరిస్థితుల్లోనూ 2027లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం.. అని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ₹12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. వైసీపీ హయాంలో రాష్ట్రం ధ్వంసమైందని, కేంద్ర ప్రభుత్వ పథకాలను పక్కదారి పట్టించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెడుతూ, టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

జులై 2 నుంచి ఇంటింటికి వెళ్దాం..

ప్రజలు ఇచ్చిన 94 శాతం స్ట్రైక్ రేట్‌ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రజలను సం తృప్తి పరుస్తూ భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత నాయకులపై ఎక్కువగా ఉంటుందన్నారు. ఎన్నికల్లో విజయం కోసం నిర్మొహమాటంగా నిర్ణయాలు తీసుకున్నామని, సుపరిపాలనకు సరికొత్త నిర్వచనం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని కొనియాడారు. చేసిన మంచిని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పు కోలేకపోవటం మనకున్న లోపమని, 2014..-19 మధ్య అభివృద్ధి పరుగులు పెట్టిందని చెప్పుకోవటంలో విఫలమయ్యామన్నారు. ఏడాది కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు చెప్పేందుకే జులై 2 నుంచి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించాలన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన దాదాపు 75 పథకాలు పునరుద్ధరించామన్నారు. విధ్వంసం నుంచి వికాసం దిశగా చేపట్టిన ప్రయాణంలో సమస్యలకు భయపడట్లేదని వివరించారు. ఏడాదిలో తొలి అడుగు మాత్రమే వేశామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందని సీఎం చంద్రబాబు నేతలకు వివరించారు. . పింఛన్ల పెంపు, పంటలకు గిట్టుబాటు ధర, అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు మంజూరు, వాట్సప్‌ గవర్నెన్స్‌తో సుమారు 500 సేవలు ఆన్‌లైన్‌లో అందిస్తున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. కేంద్రంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏపీకి సహకరిస్తోందని చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించింది. స్టీల్‌ప్లాంట్‌కి రూ.11,400 కోట్లు మంజూరు చేసిందని చంద్రబాబు చెప్పారు.

పని తీరు మార్చుకోండి

తాను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితి, నేతల పనితీరుపై సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల్లో సర్వేలు చేయిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి.. వాస్తవాలను బేరీజు వేస్తున్నానన్నారు. ఎమ్మెల్యేలతో శనివారం నుంచి ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తున్నాని, రోజుకు నలుగురు ఎమ్మెల్యేలతో మాట్లాడుతున్నానని పేర్కొన్నారు. తాను చెప్పాల్సింది ఎమ్మెల్యేలకు చెబుతున్నానని, ఎమ్మెల్యేల పనితీరు మారాలని తేల్చి చెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని లేకపోతే ఇక అంతే సంగతులని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కొందరు ఎంతో పని చేస్తారు.. కానీ..

ఎంత పని చేశామనే అంశంతోపాటు.. ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొందరు ఎంతో పని చేస్తారు.. కానీ మంచి పేరు రాదని.. ఇంకొందరు పెద్దగా పని చేయకున్నా.. ప్రజల్లో మంచి పేరు ఉంటుందని అన్నారు. ఇప్పుడు గెలిచిన వాళ్లు.. మళ్లీ మళ్లీ గెలవాలని, ఆ దిశగా ఆలోచన చేస్తున్నానని చెప్పారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని చంద్రబాబు సూచించారు. వారసత్వం ఉంది, వారసులకు హ్యాండ్ హోల్టింగ్ ఇస్తాం, కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందన్నారు. ఏమైనా లోటు పాట్లు ఉంటే సరిదిద్దుకుందామని, మన ప్రవర్తనలో ఏమైనా తప్పులుంటే సరి చేసుకుందామన్నారు. ప్రజలు, కార్యకర్తలకు నచ్చని విషయాలను మార్చుకోవడానికి సిద్దంగా ఉన్నామని, ప్రజా విశ్వాసాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Leave a Reply