ఢిల్లీ : సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. పాస్ పోర్టు వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్ కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు.
తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే తాను భారత్ కు తిరిగి వస్తానని కోరుతూ గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ వాదనల తర్వాత ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు మే 2వ తేదీన హైకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును ప్రభాకర్ రావు మే 9వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలేనని, చికిత్స నిమిత్తమే అమెరికా వెళ్లాలని కోర్టుకు వివరించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దేశానికి తిరిగి వస్తానని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవాల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఆగస్టు 5కి వాయిదా వేసింది.