TG | ఆగ‌ని రైతుల ఆత్మ‌హ‌త్య‌లు… రేవంత్ పై హ‌రీశ్ ఫైర్

హైద‌రాబాద్ : లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని గ్రామసభలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ములుగు జిల్లా, బుట్టాయిగూడెంకు చెందిన కుమ్మరి నాగయ్య (నాగేశ్వర్ రావు) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమ‌న్నారు బీఆర్ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్ రావు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తుంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖం చాటేస్తే, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. నాగయ్యకు మంచి వైద్యం అందించి, ప్రాణాలు కాపాడేందుకు ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రయత్నించింద‌న్నారు. కానీ దురదృష్టవశాత్తు నాగయ్య ప్రాణాలు వదిలార‌నిఆవేద‌న వ్య‌క్తం చేశారు.. ఈ మేర‌కు ఆయ‌న నేడు త‌న ఎక్స్ ఖాతాలో ట్విట్ చేశారు..

తన చావుతోనైనా అర్హులైన పేదలకు పథకాలు ఇవ్వాలని అధికారులకు చెబుతూ పురుగుల మందు తాగి, ఆసుపత్రి పాలైన నాగయ్య దుస్థితికి ప్రభుత్వమే కారణమ‌ని, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హత్య ఆంటూ ధ్వ‌జ‌మెత్తారు. ఉన్నదాంతో కుటుంబాన్ని పోషిస్తూ జీవితం గడుపుతున్న నాగయ్య కుటుంబంలో గ్రామసభల పేరిట నిప్పులు పోసింది కాంగ్రెస్ ప్రభుత్వమ‌ని ఆరోపించారు. భర్తను, తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్న భార్య, ముగ్గురు ఆడబిడ్డలను ఎవరు ఆదుకోవాలని ప్ర‌శ్నించారు.

పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే యావతో, ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా, లబ్ధిదారుల ఎంపిక సరిగ్గా జరపకుండా, జాబితా విడుదల చేస్తూ ప్రజల్లో గందరగోళం రేపింది కాంగ్రెస్ పార్టీ అంటూ విమ‌ర్శించారు. దీంతో పాటు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకే పథకాలు అంటూ బాహాటంగా ప్రకటించడంతో గ్రామసభల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పట్ల ప్రజల్లో ఆందళన మొదలైంద‌న్నారు. దరఖాస్తుల పేరిట దగా చేయడం తప్ప, ఏడాది పాలనలో మీరు చేసిందేముంద‌ని హ‌రీశ్ రావు నిల‌దీశారు.


గ్రామసభల సాక్షిగా తిరగబడ్డ జనం, ఎక్కడిక‌క్కడ నిలదీసిన దృశ్యాలు.. మీ 14 నెలల పాలన వైఫల్యాన్ని ఎత్తి చూపాయని గుర్తు చేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి, ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలిట అభయహస్తం కాదు, భస్మాసుర హస్తమ‌ని అన్నారు. రోడ్డున పడ్డ నాగయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామ‌న్నారు.

ధైర్యం కోల్పొవ‌ద్దు …
రాష్ట్ర ప్రజలారా.. ఆత్మహత్యలు పరిష్కారం కాదు. నమ్మి ఓటేసినందుకు నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ పార్టీపై కొట్లాడుదాం. హక్కుగా రావాల్సిన పథకాలను సాధించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నామ‌ని ట్విట్ చేశారు హ‌రీశ్.

రేవంత్ జీ… మీ జిల్లాలో విద్యార్ధుల అవ‌స్థ‌లు చూడండి…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా నారాయణపేట కోస్గిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాక్ష్యాత్తు సీఎం సొంత ఇలాఖాలో ఇంతటి దారుణ పరిస్థితులు నెలకొనడంపై విద్యార్థుల పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సీఎం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం బాగా లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రొడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఓ పేపర్ క్లిప్పింగును దానికి అటాచ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలోనే ఇలా ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని తీరు ఎలా ఉందో కోస్గి ప్రభుత్వ పాఠశాల దుస్థితి చూస్తే తెలిసిపోతుందని మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *