Students | ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు అవగాహన

Students | ప్రజాస్వామ్యంపై విద్యార్థులకు అవగాహన
- అసెంబ్లీ నిర్వహణ పై సంపూర్ణ విశ్లేషణ…
- సందేహాలకు నేతల స్పష్టమైన సమాధానాలు…
- అసెంబ్లీని సందర్శించిన నంబూరు వివా వరల్డ్ స్కూల్ విద్యార్థులు…
- శాసనసభ అనుభవం జీవితాంతం గుర్తుండే జ్ఞాపకం…
- విద్యార్థుల ఆనందం…
Students | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నంబూరు వివా వరల్డ్ స్కూల్ విద్యార్థులు మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభను సందర్శించి ప్రజాస్వామ్య వ్యవస్థను ప్రత్యక్షంగా వీక్షించే అరుదైన అవకాశాన్ని పొందారు. శాసనసభ సమావేశాలను గ్యాలరీ నుంచి వీక్షించిన విద్యార్థులు ప్రశ్నోత్తరాలు, చట్టాలపై చర్చలు, ప్రజా సమస్యల ప్రస్తావన వంటి అంశాలను ఆసక్తిగా గమనించారు. పుస్తకాలలో చదివిన ప్రజాస్వామ్య విధానాన్ని ప్రత్యక్షంగా చూడటం తమకు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని విద్యార్థులు పేర్కొన్నారు.
సభా కార్యక్రమాల అనంతరం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్లను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు “ఒక చట్టం ఎలా రూపుదిద్దుకుంటుంది?”, “ప్రజల సమస్యలు అసెంబ్లీలో ఎలా ప్రస్తావిస్తారు?”, “ఎమ్మెల్యే బాధ్యతలు ఏమిటి?”, “యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏమి చేయాలి?” వంటి పలు ప్రశ్నలను అడిగారు.

దీనికి స్పందించిన నాయకులు ఒక బిల్లును ఎలా ప్రవేశపెడతారు, దానిపై చర్చలు ఎలా జరుగుతాయి, చివరకు అది చట్టంగా ఎలా మారుతుంది అనే అంశాలను సులభంగా వివరించారు. ప్రజల అభిప్రాయాలు, సమస్యలు ప్రజాప్రతినిధుల ద్వారా శాసనసభలో ఎలా ప్రతిధ్వనిస్తాయో స్పష్టంగా తెలియజేశారు. ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మీరు చదువులో ప్రతిభ కనబరుస్తూ సమాజంపై అవగాహన పెంపొందించుకుంటే భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగగలుగుతారు” అని విద్యార్థులకు ప్రోత్సాహం ఇచ్చారు.

యువతలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాభావం పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. ఇలాంటి విద్యా పరమైన అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విద్యార్థులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్శన ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై తమ అవగాహన మరింత పెరిగిందని, భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుత పౌరులుగా మారాలని సంకల్పించుకున్నామని వారు తెలిపారు. శాసనసభ అనుభవం తమ జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆనందం వ్యక్తం చేశారు.



click here to read more : Re survey | రీ సర్వే ను పరిశీలించిన జిల్లా కలెక్టర్…
