కర్నూలు బ్యూరో, మే 30, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విడాకులకు అంగీకరించలేదని ఓ భర్త భార్య, అత్తపై వేట కొడవలితో దాడి చేసి గాయపరిచిన ఘటన పెద్దకడబూరు మండలం, కబంధ హల్లు గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జయమ్మ అనే మహిళ తన కుమార్తె రేణుకను, ఆలూరు మండలం అంగస్కల్ గ్రామానికి చెందిన వేమారెడ్డికి ఇచ్చి వివాహం జరిపించారు. 16 ఏళ్లుగా కాపురం చేసిన వీరి మధ్య కుటుంబ సమస్యలు తలెత్తాయి.
దీంతో భార్యాభర్తల మధ్య తరచూ కలహాలు జరిగేవి. ఈ క్రమంలో భర్త తన భార్య నుంచి విడాకులు కోరాడు. అందుకు ఆమె భరణంతో పాటు ఇద్దరు పిల్లలు తనకే చెందాలని కోరింది. ఇందుకు భర్త అంగీకరించకపోవడంతో మనస్పర్ధలు మరింత పెరిగాయి. దీంతో ఐదేళ్ల నుంచి భార్యాభర్తలు ఇరువురు వేరువేరుగా ఉంటున్నారు. కాగా నేటి ఉదయం వేమారెడ్డి తన అత్తింటికి వెళ్లి అత్త, భార్యపై వేట కొడవలితో దాడి చేశాడు. దీన్ని గమనించిన స్థానికులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే పోలీసులు నిందితుడిని అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.