బెంగళూరు : భారత అస్ట్రోనాట్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్రలో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం ఈనెల 22న యాక్సియం-4 మిషన్ను చేపడతామని నాసా (NASA) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రయోగాన్ని మరోసారి వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు చేపడతామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని నాసా వెల్లడించింది.
నాసాతో కలిసి ఇస్రో (ISRO) చేపడుతున్న ఈ ప్రయోగం షెడ్యూల్ ప్రకారం మే 29న జరగాల్సి ఉన్నది. అయితే వివిధ కారణాలతో ఇప్పటికి ఆరుసార్లు వాయిదా పడుతూ వస్తున్నది. అమెరికాలోని ఫ్లోరిడా (Florida) లో ఉన్న నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. దీనిద్వారా భారత్, పోలండ్, హంగేరీకి చెందిన నలుగురు వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతున్నారు. ఈ మిషన్కు భారత వ్యోమగామి శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరించబోతున్నారు.