పల్నాడు జిల్లా గుంటూరు- పెద్దకూరపాడు మధ్య ఘటన
సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు
నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
పల్నాడు ప్రతినిధి, (ఆంధ్రప్రభ) : పల్నాడు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రన్నింగ్ ట్రైన్లో ఒంటరిగా ఉన్న ఓ ప్రయాణికురాలిపై దుండగుడు కత్తితో బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుంటూరు- పెదకూరపాడు రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం జరగ్గా, బాధితురాలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ(35) సోమవారం (13వ తేదీ) రాజమహేంద్రవరంలో సంత్ర గాచి ప్రత్యేక ట్రైన్ మహిళా బోగీలో ఎక్కారు. ఆ రైలు గుంటూరు స్టేషన్ కు చేరుకున్న సమయంలో బోగిలో ఉన్న ప్రయాణికులంతా దిగిపోయారు.
ఆమె ఒక్కతే మిగిలారు. ఆ సమయంలో రైలు కదులుతుంది. సుమారు 40 సంవత్సరాల వ్యక్తి రన్నింగ్ ట్రైన్ లో మహిళ బోగిలోకి ప్రాధేయపడి ఎక్కాడు. రైలు గుంటూరు నుంచి బయలుదేరిన 20 నిమిషాల తరువాత ఒంటరిగా ఉన్న మహిళపై ఆ వ్యక్తి కత్తితో బెదిరించి హ్యాండ్ బ్యాగ్, సెల్ ఫోన్, డబ్బులు లాక్కొని లైంగికదాడి చేశాడు. రైలు పెద్దకూరపాడు స్టేషన్ కు చేరుకుంటున్న సమయంలో ఆ వ్యక్తి కిందకు దిగి పారిపోయాడు. మంగళవారం రైలు చర్లపల్లి స్టేషన్ కు చేరుకుoది. అనంతరం బాధిత మహిళ చర్లపల్లికి రాగానే నేరుగా సికింద్రాబాద్ జిఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.