దేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు ఆయనే..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు పట్టణంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చిత్తూరు జిల్లా (Chittoor District) పోలీసులు ఐక్యతా పరుగు (రన్ ఫర్ యూనిటీ) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశానికి మొదటి హోంమంత్రిగా పని చేసిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ దేశ రక్షణ, సమగ్రత కోసం చేసిన కృషిని ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారి తుషార్ డూడి మాట్లాడుతూ.. సర్దార్ పటేల్ భారతదేశాన్ని ఏకతాటిపై నడిపించిన మహనీయుడు అని, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ తమ విధుల్లో పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతకు పటేల్ చేసిన కృషి వలన ఆయనకు “ఉక్కు మనిషి” అనే బిరుదు లభించిందని అన్నారు.
పటేల్ (Patel) స్వాతంత్ర్యం తరువాత ఉప ప్రధానమంత్రిగా, హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అప్పట్లో రాజుల పాలనలో ఉన్న సుమారు 550కు పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్లో విలీనం చేసి దేశ ఏకీకరణకు విశేష కృషి చేశారని తుషార్ డూడి వివరించారు. భిన్న జాతులు, భాషలు, భౌగోళిక పరిస్థితులు ఉన్నా దేశాన్ని సమైక్యంగా ఉంచిన పటేల్ కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ప్రజలందరితో ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. గాంధీ సర్కిల్ నుండి పి.వి.కె.ఎన్. డిగ్రీ కళాశాల వరకు ఐక్యతా పరుగు నిర్వహించారు.
జిల్లా వ్యాప్తంగా అన్ని ఉపవిభాగాల్లో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా జరుపుతూ ఐక్యతా పరుగు కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, పోలీసు సిబ్బంది ఉత్సాహంగా పరుగెత్తారు. విజేతలకు జిల్లా అధికారులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీసు అధికారి (ఆపరేషన్స్ మరియు ఇన్చార్జ్ అడ్మిన్) ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు, అదనపు పోలీసు అధికారి (ఏ.ఆర్) ఆర్. శివానంద కిషోర్, చిత్తూరు ఉపవిభాగ డిఎస్పీ టి. సాయినాథ్, ఏ.ఆర్. డిఎస్పీలు చిన్నికృష్ణ, మహబూబ్ భాష, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మహేశ్వర, టూ టౌన్ ఇన్స్పెక్టర్ నెట్టికంటయ్య, ఎస్.బి. ఇన్స్పెక్టర్ మనోహర్, ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నిత్యబాబు, ఆర్.ఐలు సుధాకర్, చంద్రశేఖర్, చిత్తూరు పోలీస్ యూనియన్ అధ్యక్షుడు ఉదయ్కుమార్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

