Sangam Vihar | ఎగిసిపడ్డ మంటలు.. ముగ్గురు మృతి

ఢిల్లీ నగరంలోని సంగ్ విహార్ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదానికి కారణమైంది. శనివారం
చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షూ షోరూంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల్లోనే ఆ మంటలు పై అంతస్తులకు చేరి మొత్తం భవనాన్ని కమ్మేశాయి. ఈఘటనపై సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అత్యవసరంగా రెండు వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకున్నారు. తర్వాత అదనంగా మరో రెండు వాహనాలను రంగంలోకి దింపడంతో మొత్తం నాలుగు ఫైరింజన్లు మంటలను అదుపులోకి తేవడానికి తీవ్రంగా శ్రమించాయి.
దాదాపు గంటన్నర పాటు సాగిన ఆపరేషన్లో మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. అనంతరం భవనంలోకి ప్రవేశించిన రెస్క్యూ సిబ్బంది మూడు మృతదేహాలను గుర్తించారు. గాయపడిన ఇద్దరు మహిళలను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం మరింత విస్తరించకుండా ఉండేందుకు చుట్టుపక్కల ఇళ్లను ముందస్తు చర్యగా ఖాళీ చేయించారు. షార్ట్సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే అసలు కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.
