Rs.3500 crore | మద్యం కుంభకోణంలో…

Rs.3500 crore | మద్యం కుంభకోణంలో…

  • కింగ్ పిన్ వెనుక ఉన్న కింగ్‌ను కూడా బయట పెట్టాలి….
  • అసెంబ్లీలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు..

Rs.3500 crore | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మద్యం కుంభకోణంలో కింగ్ పిన్ వెనుక ఉన్న కింగ్ ను కూడా బయట పెట్టాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ దశల వారీగా మద్యపాన నిషేధం అంటూ 2019-24 వరకు అప్పటి ప్రభుత్వ మద్యం పాలసీ అమలు రాష్ట్ర ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందన్నారు. అప్పట్లో నాణ్యమైన బ్రాండ్ లు అందుబాటులో లేవన్నారు. నాసిరకం మద్యంతో పాటు ధరలు కూడా భారీగా పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు.

మద్యం తయారీ కంపెనీల నుంచి లిక్కర్ కేసుపై రూ.250లు, బీరు కేసుపై రూ.150లు కమిషన్ల రూపంలో వసూలు చేసి, మద్యం వ్యాపారాన్ని ఒక వ్యవస్థీకృత నేరంగా మార్చారని అన్నారు. రూ.3500 కోట్ల భారీ మద్యం కుంభకోణం కాబట్టి నిందితులకు 300 రోజులు అయినా కూడా బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు కూడా నిన్న స్పష్టం చేసిందన్నారు. అప్పటి ప్రభుత్వం అమలు చేసిన అసంబద్ధమైన విధానంతో నాణ్యమైన మద్యం ఇక్కడ లభించక ప్రజలు పక్క రాష్ట్రాల నుంచి వాహనాల ద్వారా మద్యం తరలించారన్నారు.

ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న మద్యం పాలసీ వల్ల పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలించే వేలాది ప్రజల వాహనాలు సీజ్ చేశారన్నారు. ఆయా వాహనాలు నిరుపయోగంగా పడి ఉన్నాయన్నారు. మద్యం అక్రమ రవాణాను తను సమర్ధించడం లేదన్నారు. ఇదే క్రమంలో ఆనాటి పాలకులు చేసిన తప్పుల వల్ల సామాన్య ప్రజలు వాహనాలు సీజ్ అయ్యి నష్టపోయారని అన్నారు. అప్పట్లో సీజ్ చేసిన వాహనాలకు కనీస అపరాధ రుసుం విధించి వాటిని విడుదల చేసి ప్రజలకు తిరిగి స్వాధీనం చేయాలని కోరారు. గత ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల కారణంగా బలై పోయిన వారిని దోషులుగా నిర్ధారించవద్దన్నారు.

దీనిపై రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సమాధానం ఇస్తూ 26,846 వాహనాలు సీజ్ చేశారని, ఇందులో ఇప్పటికే నాయస్థానాల ఆదేశాల ప్రకారం 4,358 వాహనాలు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. మరో 18,047 వాహనాలు వేలం వేసినట్లు వివరించారు. మరో 4,041 వాహనాలు కోర్టు ఉత్తర్వుల ప్రకారం విడుదల చేస్తామని అన్నారు.

Leave a Reply