RR vs MI | చెలరేగిన టాపార్డర్.. రాజస్థాన్ ముందు భారీ టార్గెట్ !

జైపూర్ వేదిక‌గా ఈరోజు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ దంచికొట్టింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన‌ ముంబై జట్టు రాజస్థాన్ బౌలర్లను ఉతికారేసింది. ఓపెనర్లు గట్టి పునాది వేయ‌డంతో.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు సైతం విజృంభించారు. దీంతో ముంబై జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో కేవ‌లం రెండు వికెట్లు మాత్ర‌మే న‌ష్ట‌పోయి 217 ప‌రుగులు సాధించింది.

ముంబై ఇండియ‌న్స్ ఇన్నింగ్స్ లో.. ఓపెన‌ర్లు రియాన్ రికెల్ట‌న్ (61 ; 38 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులు), రోహిత్ శ‌ర్మ (53 ; 36 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగారు. వీరిద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ కు 71 బంతుల్లో 116 ప‌రుగులు జోడించారు.

ఇక రెకెల్టన్, రోహిత్ లు ఔటైన తరువాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (48 ; 23 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (48 ; 23 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సులు) చెరో 48 పరుగులు బాది 3వ వికెట్ కు 44 బంతుల్లోనే 94 పరుగులు జోడించారు. దాంతో ముంబై ఇండియన్స్ స్కోర్ బోర్డుపై భారీ పరుగులు నమోదయ్యాయి.

ఇక రాజస్థాన్ బౌలర్లలో మహేష్ తీక్షణ, కెప్టెన్ రియాన్ పరాగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో 218 పరుగుల భారీ లక్ష్యంతో రాజస్థాన్ జట్టు ఛేజింగ్ కు దిగనుంది.

Leave a Reply