కడప : రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాలకొండ్రాయుడు (78) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు..
1946 జూలై 3వ తేదీన జన్మించిన పాలకొండ్రాయుడు జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 1978లో కడప జిల్లాలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో రెండవ సారి రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
లోక్ సభ సభ్యుడిగా ..
అనంతరం టీడీపీలో చేరి1984 లో ఆంధ్రప్రదేశ్ లోని రాజంపేట లోక్ సభ నియోజకవర్గం నుండి లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించారు. అనంతరం1999, 2004 లలో రాయచోటి శాసనసభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.
పాలకొండ్రాయుడుకు ఓ భార్య ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్ బాబు ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్ గా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన పాలకొండ్రాయుడుకు రాయచోటి నియోజకవర్గంలో 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. ఆయన మృతి పట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు