హైదరాబాద్ – ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) (anchor Swetcha ) ఆత్మహత్య (suicide) చేసుకున్నారు. శుక్రవారం రాత్రి చిక్కడపల్లిలోని (chikkadapalli ) తన నివాసంలో ఆమె బలవన్మరణానికి పాల్పడింది. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ (si raju nayak ) వెల్లడించిన వివరాల ప్రకారం.. జవహర్నగర్లోని తన ఇంట్లో శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఫ్యానుకు లుంగీతో ఉరేసుకుని ఆమె ప్రాణాలు విడిచినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఐదేళ్ల క్రితం భర్త నుంచి విడాకులు (Divorce ) తీసుకున్న స్వేచ్ఛ, తన కుమార్తె లు, పూర్ణచంద్రరావు తో (purnachandrarao ) కలిసి ఉంటున్నారు. అయితే, ఆ స్నేహితుడితో ఏర్పడిన వ్యక్తిగత విభేదాల కారణంగానే ఆమె ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఆమె మృతికి కచ్చితమైన కారణాలపై ఆరా తీస్తున్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లి శ్రీదేవి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనగర్లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి శంకర్, ఉమ్మడి ఏపీలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో చేస్తున్నారు. ఇటీవలే జరిగిన జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యురాలిగా ఎన్నికయ్యారు. యాంకర్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్వేచ్ఛ ఆకస్మిక మరణం పట్ల తోటి జర్నలిస్టులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
స్వేచ్చ మరణం విషాదకరం – కెసిఆర్
తెలంగాణ ఉద్యమ జర్నలిస్టు స్వేచ్ఛ వొటార్కర్ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR ) సంతాపం ప్రకటించారు. సామాజిక స్పృహ వున్న కవయిత్రిగా, జర్నలిస్టుగా ఎదుగుతున్న స్వేచ్ఛ మరణం విషాదకరమన్నారు. ఆమె ఆకస్మిక మరణం పట్ల కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో స్వేచ్ఛ తల్లిదండ్రులు సహచర శంకర్, శ్రీదేవిలు చురుకుగా పాల్గొన్నారని, బిడ్డను కోల్పోయి శోకతప్త హృదయులైన వారికి కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
స్వేచ్చ ప్రతిభ కలిగిన మహిళా మేధావి -కెటిఆర్
సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr ) తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగి తెలంగాణ వాది అని, ఆమె అకాల మరణం విని తీవ్ర ఆవేదనకు లోనయ్యాను అని, మాటలు రావడం లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళా మేధావిని కోల్పోయిందిని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఇంతటి బరువైన విషాదకర సమయంలో వారి కుటుంబం స్థైర్యాన్ని పొందాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, స్వేచ్ఛ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.
హరీశ్ రావు సంతాపం ..
జర్నలిస్టు, తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. భవిష్యత్తులో ఎంతో ఉన్నతిని సాధించగల మంచి జర్నలిస్టుగా ఎదుగుతున్న ఆమె జీవితం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవడం విషాదకరం అని పేర్కొన్నారు. ఈ బాధను తట్టుకునే ధైర్యాన్ని ఆమె కుటుంబానికి దేవుడు ప్రసాదించాలని, స్వేచ్ఛ ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను అని హరీశ్రావు పేర్కొన్నారు.
స్వేచ్చ మరణం కలచి వేసింది – కవిత
తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్, ప్రముఖ న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ అకాల మరణం కలచి వేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత . ఎంతో ఉజ్వల భవిష్యత్ ఉన్న స్వేచ్ఛ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకుంటున్న. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..