Review | అత్యుత్తమ ఫలితాలే లక్ష్యం..

Review | అత్యుత్తమ ఫలితాలే లక్ష్యం..
- పదిలో విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి
- తిరువూరు శాసనసభ్యుడు కొలకపూడి శ్రీనివాసరావు
- నాలుగు మండలాల విద్యాధికారులతో సమీక్ష
Review | తిరువూరు, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు వచ్చేలా అన్ని చర్యలు చేపట్టాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. తిరువూరు నియోజకవర్గంలో విద్యా ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయన తన క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారుల విధులు, బాధ్యతలు, విద్యార్థులు పాఠశాలలకు గైర్హాజరు కావడానికి గల కారణాలు, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ్యులు సవివరంగా తెలుసుకున్నారు.
మరో అరవై రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు పెంచడం, బోధన నాణ్యత మెరుగుపరచడం, ఫలితాల్లో ఉత్తమ స్థాయిని సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు. విద్యారంగ పురోగతికి ప్రతీ ఒక్కరు బాధ్యతతో పనిచేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
