హైదరాబాద్ – ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ కాస్త కోలుకోవడంతో పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు.
కొద్ది రోజులు విశ్రాంతి అవసరమని..అందుకే ఇండియాలో ఇంట్లోనే ఉంచి జాగ్రత్తలు తీసుకోనున్నారని చెబుతున్నారు. ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్ తన కొడుకుని ఎత్తుకొని కనిపించారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, శ్రేయోభిలాషులు, జనసైనికులు కంగారు పడ్డారు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేశారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుండగా, అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది మంటలను అర్పించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడ్డాడు. చేతులు, కాళ్లు గాయాలు అయ్యాయి. దట్టమైన పొగ కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లోకి పొగ చూరుకుంది
మార్క్ శంకర్కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వెంటనే సింగపూర్ లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మార్క్ ప్రస్తుతం కోలుకున్నాడు. ఇటీవల చిరంజీవి కూడా తన ఎక్స్లో మార్క్ శంకర్ ఇంటికి తిరిగొచ్చేశాడు అని కామెంట్ పెట్టారు.