ADB | టిప్పర్ ఢీ.. రిటైర్డ్ టీచర్ మృతి..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ఇవాళ‌ జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవోళ్ళ నారాయణ (63) అనే రిటైర్డ్ టీచర్ అక్కడికక్కడే మృతి చెందారు. విద్యానగర్ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణ ఇవాళ‌ ఉదయం మార్నింగ్ వాక్ అనంతరం స్కూటీపై ఇంటికి వస్తుండగా కలెక్టర్ చౌరస్తాలో మూలమలుపుపై టిప్పర్ వాహనం ఢీకొనడంతో టైర్ల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిగ్నల్స్ లేకనే ప్రమాదాలు…!
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ చౌరస్తాలో ప్రతిరోజూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొమరం భీమ్ చౌరస్తా సర్కిల్ ను మరింత విశాలంగా పెంచడం, ప్రధాన కూడలిలోనే ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అసలే ఇరుకురోడ్లు, ఆపై పద్మవ్యూహాన్ని తలపించే జిగ్ జాగ్ కూడలి నిత్య ప్రమాదాలకు కారణభూతమవుతోంది. ఇప్పటికే ఈ చౌరస్తాలో ఏడు ఎనిమిది మంది మృతి చెందారని, 40మందికి పైగా గాయపడ్డారని అక్కడి ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, కలెక్టర్ రాజార్షి షా సీరియస్ గా స్పందించి కలెక్టరేట్ చౌరస్తాను ప్రమాద ర‌హిత‌ ప్రాంతంగా తీర్చిదిద్దాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *