Varanasi | ప్రముఖ యోగా గురువు కన్నుమూత : ప్రధాని మోదీ, యోగి ఆదిత్యనాథ్ సంతాపం

వారణాసి : ప్రఖ్యాత యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద (128) వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి శివానంద యోగా, ఆధ్యాత్మిక సాధనకు అంకితమైన జీవితం దేశంలోని ప్రతి తరానికి స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఆయన మరణం కాశీవాసులతో పాటు లక్షలాది మంది అనుయాయులకు తీరని లోటని అన్నారు.

1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్‌లోని సిల్హెత్ (ప్రస్తుత బంగ్లాదేశ్ )లో నిరుపేద కుటుంబంలో జన్మించిన శివానంద, ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులను కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోని నవద్వీప్‌లో గురు ఓంకారానంద గోస్వామి ఆశ్రమంలో పెరిగారు. గురువు ఆయనకు యోగా, ఆధ్యాత్మిక విద్యను బోధించారు. తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేసిన శివానంద, గత 50 ఏళ్లుగా పూరిలో 400-600 కుష్టు రోగులకు ఆహారం, వస్త్రాలు, దుప్పట్లు, వంట సామగ్రి వంటివి అందజేస్తూ సేవ చేశారు.

2022లో యోగా రంగంలో అసాధారణ కృషికి గాను అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. తెల్ల ధోవతి, కుర్తాలో, చెప్పులు లేకుండా సాదాసీదాగా రాష్ట్రపతి భవన్‌లో అవార్డు స్వీకరించిన వైనం అప్పట్లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన సాదాసీదా జీవనశైలి, యోగా పట్ల అంకితభావం, సమాజసేవ పట్ల నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చాయి.

స్వామి శివానంద రోజూ ఉదయం 3 గంటలకే లేచి యోగా సాధన చేసేవారు. నీటితో కాచిన సాదా ఆహారం తీసుకుంటూ, చాపపై నిద్రించే ఆయన జీవనశైలి ఆరోగ్యవంతమైన జీవితానికి ఆదర్శంగా నిలిచింది. 2019లో బెంగళూరులో యోగా రత్న అవార్డు సహా ఆయన అనేక పురస్కారాలు అందుకున్నారు. మహాకుంభమేళాలో సుమారు 100 ఏళ్లుగా పాల్గొంటూ ఆధ్యాత్మిక ఉనికిని చాటారు. శివానంద అంత్యక్రియలు వారణాసిలోని కబీర్‌నగర్ కాలనీలోని ఆయన నివాసంలో జరగనున్నాయి. ఆయన శిష్యులు, అనుయాయులు అంతిమ దర్శనం కోసం ఏర్పాట్లు చేశారు.

Leave a Reply