ఎయిర్ టు ఎయిర్.. సర్పేస్ టు ఎయిర్
టార్గెట్లను విజయవంతంగా ఛేదించిన పరీక్షలు
సోషల్ మీడియాలో పలు వీడియోలు
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇండియా- పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారత నావికా దళం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైతే తాము యుద్ధానికీ సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం మధ్యలో క్షిపణి పరీక్షలను నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ పరీక్ష..
అరేబియా సముద్రంలో భారత నావికా దళం నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. ఈ యుద్ధనౌకల్లో కోల్కతా-క్లాస్ డిస్ట్రాయర్లు, నీలగిరి, క్రివాక్-క్లాస్ ఫ్రిగేట్లు ఉన్నాయి. మూడు రోజుల క్రితం ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించారు. గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్.. గగనతలంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను నౌకాదళం విడుదల చేసింది.