కొలనూరులో సన్న బియ్యం పంపిణీ…

కొలనూరులో సన్న బియ్యం పంపిణీ…
పరిశీలించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి జిల్లా, ఆంధ్రప్రభ : కొలనూరు లో ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ విధానాన్ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ఆకస్మికంగా పరిశీలించారు. రేషన్ దుకాణానికి చేరుకుని నిల్వలు, పంపిణీ విధానం, బియ్యం నాణ్యతను స్వయంగా పరిశీలించారు.
రాబోయే మూడు నెలలకు సరిపడా బియ్యం నిల్వలు ఉన్నాయా అని స్థానిక డీలర్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంపిణీ అవుతున్న బియ్యం పరిమాణం, నాణ్యతపై స్పష్టత తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయాలని సూచించారు.
బియ్యం తీసుకోవడానికి వచ్చిన ప్రజలతో కూడా మాట్లాడి, వారికి సకాలంలో బియ్యం అందుతున్నాయా? డీలర్ ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా? అనే అంశాలను తెలుసుకున్నారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని అధికారులకు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ స్వయంగా కొంతమంది లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేసి వారికి భరోసా కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిజంగా అర్హులకు చేరాలని, ఎలాంటి అక్రమాలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
