- స్విగ్గీ, జొమాటోకు పోటీగా
భారతదేశంలో బైక్ టాక్సీ, ఆటో సేవలతో ముందున్న రాపిడో ఇప్పుడు ఫుడ్ డెలివరీ రంగంలోకి అడుగుపెడుతోంది. మార్కెట్లో ఇప్పటికే అధిక ప్రభావం చూపిస్తున్న స్విగ్గీ, జొమాటో లాంటి దిగ్గజాలకు తక్కువ కమీషన్ రేటుతో పోటీగా నిలబడే ప్రయత్నం చేస్తోంది. ఈ దిశగా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI)తో రాపిడో ఒప్పందం కుదుర్చుకుంది.
రాపిడో ఫుడ్ డెలివరీ సేవలు – తక్కువ ఛార్జీలతో ప్రారంభం
రాపిడో తొలుత బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించనుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, ఇతర నగరాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో లాంటి సంస్థలు 16% నుంచి 30% వరకూ కమీషన్ వసూలు చేస్తున్న తరుణంలో, రాపిడో కేవలం 8% నుంచి 15% మధ్యే కమీషన్ తీసుకోనుంది.
అంతేకాదు, ఆర్డర్ విలువ ఆధారంగా ఫిక్స్డ్ డెలివరీ ఫీజు కూడా అమలు చేయనుంది. రూ.400 లోపు ఆర్డర్లకు ₹25 డెలివరీ ఛార్జ్. రూ.400 కంటే ఎక్కువ ఆర్డర్లకు ₹50 ఛార్జ్. ఈ మోడల్ చిన్న స్థాయి రెస్టారెంట్లకు పెద్ద ఊరటనిస్తుంది. వినియోగదారులు రాపిడో యాప్ ద్వారా రెస్టారెంట్లను బ్రౌజ్ చేసి నేరుగా ఆర్డర్ చేయగలుగుతారు.
ప్రస్తుతం ఫుడ్ డెలివరీ రంగంలో రెండు ప్రధాన కంపెనీలు మాత్రమే ఉన్నందున, రాపిడో ప్రవేశం వినియోగదారులకు మెరుగైన ఎంపికలను అందించగలదని, రెస్టారెంట్లకు కూడా లాభదాయకంగా ఉంటుందని భావిస్తున్నారు.