దేశ భవిష్యత్తుకు పునాది తరగతి గదిలోనే…
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడూ ఎదగాలంటే చదువు ఒక్కటే మార్గమని, అందరం కలిసి వారికి నాణ్యమైన విద్యను అందిద్దామని కోరారు.
“విద్యా రంగం అభివృద్ధి కోసం తెలంగాణలో ఏటా 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ పిల్లలే దేశ భవిష్యత్తు. వారి భవిష్యత్తు ఉపాధ్యాయులైన మీ చేతుల్లో ఉంది. రాష్ట్రంలో 1 లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రైవేటు స్కూళ్లకంటే నాణ్యమైన విద్యను అందించడానికి అందరం నడుం బిగిద్దాం” అని అన్నారు.
బలమైన తెలంగాణను నిర్మించాలంటే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని బలంగా విశ్వసిస్తానని చెప్పారు. గురుపూజోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారతరత్నడాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విద్యార్థినీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను ప్రారంభించి స్టాల్స్ అన్నింటినీ పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లు రాణించాలి. ప్రైవేటు స్కూళ్లలో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ మూడేళ్లు చదివిన తర్వాత పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదు. అందుకే విద్యా కమిషన్ సూచనల మేరకు ప్రభుత్వ బడుల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభిస్తున్నాం.
ఈ ఏడాది 3 లక్షల మంది విద్యార్థినీ విద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి వచ్చారంటే ఉపాధ్యాయుల కృషి మాత్రమే. అందుకు టీచర్లందరినీ అభినందిస్తున్నా. పిల్లలు బడికి పోవడానికి రవాణా సౌకర్యం లేకపోతే స్కూల్ టీచర్లు వారి జీతంలో కొంత కేటాయించి సామాజిక బాధ్యతగా ఆ డబ్బుతో పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులైన భార్య, భర్తలిద్దరూ కలిసి ఆదివాసీ పిల్లలకు చదువు చెబుతున్న తీరు అభినందనీయం.
పెండింగ్లో ఉన్న ప్రమోషన్ల సమస్యలను పరిష్కరించాం…
రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ఆదరించి, అవకాశం ఇచ్చినందున విద్యా శాఖ నా వద్ద పెట్టుకుని తక్షణమే మీ బదిలీలు, ప్రమోషన్లు వంటి సుదీర్ఘ కాలం పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాం. కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ వీలైనంత మేరకు అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం.
తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటే తెలంగాణ బాగుపడుతుందని అందరూ భావించారు. కానీ అందుకు విరుద్ధంగా సింగిల్ టీచర్ పాఠశాలలు ఎన్ని మూత పడ్డాయో ఉపాధ్యాయులకు తెలుసు. ఉపాధ్యాయుల సమస్యలేవీ పరిష్కారం కాలేదు.
ప్రజా ప్రభుత్వం వచ్చాక 15 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్స్ కల్పించాం. బదిలీలు చేపట్టాం. కేవలం 55 రోజుల్లో టెట్ నిర్వహణతో సహా కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వహించి 11 వేల మందికి టీచర్ ఉద్యోగాలిచ్చాం. అవగాహనతో కూడిన బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలని విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.
మూతపడే పరిస్థితికి ఉస్మానియా, కాకతీయ..
విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం. ప్రైవేటు యూనివర్సిటీలు పెట్టుకుని విద్యపై ఆదిపత్యం చెలాయించాలన్న ప్రయత్నాలు జరిగాయి. వర్సిటీల్లో నియామకాలు ఆగిపోయాయి. ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు రిటైరైపోతుంటే కొత్త నియామకాలు చేపట్టలేదు. దేశానికి గొప్ప మేధావులను అందించిన ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి.
తెలంగాణలో గతంలో గురుపూజోత్సవ కార్యక్రమాలు ఎప్పుడైనా జరిగాయా. తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర, వారి సేవల అవసరం ఉంటుందని మీతో మాట్లాడటానికి సమయం కేటాయించా. నేనూ గ్రామీణ పాఠశాలలోనే చదువుకున్నా. మీలాంటి వారు చదువు చెబితేనే ఈ స్థాయికి ఎదిగా.
చదువుతోనే తలరాత మారుతుంది…
రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిల్లో 24 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూల్స్ ఉంటే వాటిల్లో 34 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు. అందుకు కారణం పాలకులుగా మేము లేదా ఉపాధ్యాయులుగా మీరు. ప్రైవేటు స్కూళ్లను అవమానించడం కాదు. పోల్చి చెబుతున్నా. ప్రైవేటుకన్నాప్రభుత్వ టీచర్లకు ఉన్నత విద్యార్హతలతో పాటు సామాజిక బాధ్యత గుర్తెరిగిన వారుంటారు.
చదువు ఒక్కటే పేదల తలరాత మార్చుతుందని బలంగా నమ్ముతా. కొన్ని సంస్థల్లో అక్కడక్కడ పుడ్ పాయిజనింగ్ ఘటనలు బాధ కలిగిస్తుంది. డైట్ చార్జీలను పెంచాం. నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చెప్పాం. ఉపాధ్యాయులు కూడా వారితో కలిసి భోజనం చేయాలి. తల్లిదండ్రులు మనపై ఎంతో విశ్వాసంతో బడులకు పంపిస్తుంటారు. వారి నమ్మకమంతా టీచర్లపైనే. మీరెప్పుడైతే పిల్లలతో కలిసి భోజనం చేస్తారో తప్పులు జరక్కుండా ఉంటుంది.
స్కిల్ ఉంటేనే సక్సెస్ !
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన సింగపూర్, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో జరుగుతున్న విద్యా విధానం అధ్యయనం కోసం ప్రతి ఏటా 2 వందల మంది ఉపాధ్యాయులను ఆయా దేశాలకు పంపించాలని నిర్ణయించాం. రాష్ట్రంలో 1 లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా నైపుణ్యం పెంచుకోవలసిన అవసరం ఉంది.
ఫౌండేషన్ సరిగా లేకుండా భవనానికి పై అంతస్తులు కట్టాలని భావించడం సరికాదు. అందుకే నర్సరీ నుంచి 12 తరగతి వరకు విద్యా రంగంలో గట్టి ఫౌండేషన్ ఉండాలని భావిస్తున్నాం. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికేట్లతో సరిపోదు. రాష్ట్రంలో ప్రతి ఏటా 1.10 లక్షల విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. స్కిల్స్ లేని కారణంగా చాలామంది వెనుకబడి పోతున్నారు.
అలాంటి విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచంలోనే అత్తున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నాం. అలాగే నైపుణ్యత కోసం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంబించాం.
రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల్లో పాత సిలబస్తో అవి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితులొస్తే టాటా కన్సల్టెన్సీ వారి సహకారంతో 2400 కోట్ల రూపాయలు వెచ్చించి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు గా మార్చుతున్నాం.
క్రీడల్లోనూ రాణించాలి…
ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశం ఒలింపిక్స్లో ఒక్క మెడల్ కూడా సాధించలేకపోవడం మనకు అవమానకరం. దేశ ప్రతిష్ట పెరగడానికి తెలంగాణలో స్పోర్ట్ వర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఉండాలని నిర్ణయించాం. మీ స్కూళ్లల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి. వారిలోని ప్రతిభను వెలికితీయడానికి పిల్లలను నిశితంగా గమనించండి. అందుకు ఏది అడిగినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కొందరు పిల్లలు మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడుతున్నారు. తద్వారా జీవితంలో దారి తప్పుతున్నారు. అలాంటి వారిని చూస్తే తల్లిదండ్రులు ఎంత వ్యధ చెందుతారో అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఒక చిన్న గంజాయి మొక్క కనబడినా కఠినంగా చర్యలు తీసుకుంటాం…” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలు, ఆయా విశ్వవిద్యాలయాల వైస్ చాన్సెలర్లు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.







