Protest Cases | హెచ్ సి యు విద్యార్ధుల‌పై కేసులు ఉప‌సంహ‌ర‌ణ – ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి ఆదేశం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పోలీసు అధికారులను ఆదేశించారు.ఈ వ్యవహారంపై సోమవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ , మంత్రుల కమిటీ మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం, ప్రజా సంఘాల ప్రతినిధుల బృందంతో నేడు చ‌ర్చ‌లు జ‌రిపారు.. ప్ర‌జాసంఘాల నుంచి వ‌చ్చిన డిమాండ్ మేర‌కు డిప్యూటీ సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. క్యాంపస్ లో ఉన్న పోలీసు బలగాలను ఉపసంహరించాలని, నిషేధాజ్ఞలు తొలగించాలని, అరెస్టైన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్లు మంత్రుల కమిటీ ముందు ఉంచగా.. విద్యార్థుల కేసులపై సానుభూతితో సమీక్షిస్తామని మంత్రుల కమిటీ హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్ట్ ఆదేశాల మేరకు వివాదాస్పద భూమిలో బందోబస్తు కొనసాగుతుందని వెల్లడించారు. అలాగే 400 ఎకరాల్లో నష్టం అంచనాకు, జీవ వైవిధ్య సర్వేకు అనుమతి కోరగా కోర్టు తీర్పు పెండింగ్ లో ఉన్నప్పుడు ఎలాంటి సర్వేకు అనుమతి ఇవ్వలేమని తెలియజేశారు. కాగా ఈ భూముల వివాదంలో అరెస్టయి, ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలని భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మిగతా విద్యార్థులపై ఉన్న కేసులను కూడా ఉపసంహరించుకుంటామని పేర్కొన్నారు. . కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *