5MonthsJail | కడిగిన ముత్యంలా తిరిగొచ్చా..

5MonthsJail | కడిగిన ముత్యంలా తిరిగొచ్చా..
5MonthsJail | న్యాయ వ్యవస్థపై పెట్టుకున్న నమ్మకం నిలబడింది
రాజకీయ కక్షతో పెట్టిన కేసు
నా కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించింది
కష్ట సమయంలో అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాతోపాటు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవితలకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో కేజ్రీవాల్, కవితతో పాటు మొత్తం 23మందికి కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. అయితే, తాజా కోర్టు తీర్పుపై కవిత మీడియాతో మాట్లాడారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కావాలనే ఇరికించారు. ఈ కేసులో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని తెలంగాణ ప్రజలకు తాను మొదటి నుంచీ చెబుతున్నానని ఆమె గుర్తు చేశారు. అందరినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పును వెలువరించిందని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తాను పెట్టుకున్న నమ్మకం నిలబడిందని కవిత వివరించారు. ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని తాను ఎన్నోసార్లు చెప్పానన్నారు. ఈ కేసు వల్ల తాను, తన కుటుంబం 5 నెలల పాటు క్షోభ అనుభవించామన్నారు. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తానని పేర్కొన్నారు. తన కుటుంబానికి దూరమై, 5 నెలలు జైలులో గడిపిన సమయాన్ని ఎవరు తిరిగిస్తారని ఆమె ప్రశ్నించారు. కోర్టు తీర్పు రాకుండానే కొందరు అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు.
