HYD | పెండింగ్ లో ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయాలి : ఈటెల రాజేందర్

నాగోల్, మే 31 (ఆంధ్రప్రభ) : పెండింగ్ లో ఉన్న అండర్ డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఎంపీ జలమండలి కార్యాలయం వద్ద శనివారం నిరసనకు దిగారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తో పాటు నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ-సురేంద్రనాథ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.

ఈటల రాజేందర్ మాట్లాడుతూ… భూగర్భ డ్రైనేజీ పనులను, వర్షాకాలం రాకముందే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లకు తాగునీటి సరఫరా అందించాలని మండిపడ్డారు. నగరమంతా మురికికూపంగా మారిందని, శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు అధికమైపోతున్నాయని, సమస్య పరిష్కరించకపోతే రెండు నెలల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని జలమండలి ఎండీ అశోక్ రెడ్డితో సమావేశంలో హెచ్చరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధమని, ఏడాది కాలంగా కార్పొరేటర్లు ఇచ్చిన వినతులు పట్టించుకోలేదని, కొత్త విస్తరణ పనులు, డ్రైనేజీ సదుపాయాలు సక్రమంగా చేయకుండా, పైపులు కూడా ప్రజలే తెచ్చుకోవాలని చెబుతున్నారని మండిపడ్డారు.

ఒక‌ వైపు విశ్వనగరం అని గొప్పగా చెబుతున్నప్పటికీ, పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తున్నా సదుపాయాలు మాత్రం కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథలో రూ.50వేల కోట్లు ఖర్చు చేసినా, ఇంకా నాలుగైదు రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తున్నాయని, కొత్త కాలనీలు, అపార్ట్ మెంట్ల‌కు కనెక్షన్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాకాలం రాకముందే మురుగు కాలువలు, పైపుల్లోని పూడికలు తొలగించి, లోతట్టు ప్రాంతాలు మునిగిపోకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని జలమండలి ఎండీకి సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *