గోదావరిఖని (ఆంధ్రప్రభ) పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దంపతులకు వారసుడొచ్చాడు. గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కలెక్టర్ కోయ శ్రీహర్ష భార్య విజయకు ప్రభుత్వ వైద్యులు ప్రసవం చేయగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఏరియా ఆసుపత్రికి సంబంధించిన సీనియర్ వైద్యురాలు హెచ్వోడి అరుణ నేతృత్వంలో శిరీష, లక్ష్మి వైద్య బృందం కలెక్టర్ భార్యకు శస్త్ర చికిత్సలు నిర్వహించి పురుడు పోశారు.
కలెక్టర్ భార్య విజయ గర్భవతిగా ఉన్నప్పటి నుండి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి లోనే వైద్య సేవలను పొందుతుంది. ప్రతి నెల క్రమం తప్పకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య పరీక్షలు నిర్వహించుకుంది. కలెక్టర్ కోయ శ్రీహర్షకు ఇది రెండో సంతానం ,మొదటి సంతానంలో కూడా కుమారుడు జన్మించగా రెండో సంతానంలో కూడా కలెక్టర్ కు మరో వారసుడొచ్చాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో కలెక్టర్ భార్య కు సక్సెస్ గా ఆపరేషన్ జరిగి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబరంలో మునిగి తేలుతున్నారు.
వైద్యులతో ఒక తండ్రిగా కలెక్టర్ తన ఆనందాన్ని సంతోషాన్ని పంచుకోవడం కనిపించింది. ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందాలన్న సర్కారు ఆలోచన విధానాలను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తూచా తప్పకుండా పాటించారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందాలన్న ఆలోచన విధానంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ పలువురికి ఆదర్శంగా నిలిచాడు. కలెక్టర్ తీరును అందరూ అభినందించారు. స్వయంగా జిల్లా కలెక్టర్ భార్యకే గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో సిజేరియన్ చేసి సక్సెస్ గా ప్రసవం చేయడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.