పాకిస్థాన్తో కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగిని దేశం నుంచి బహిష్కరించింది. 24 గంటల్లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశం జారీ చేసింది. ఈ మేరకు భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ భారత్లో పాకిస్థాన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న అధికారికి భారత విదేశాంగ శాఖ లేఖ రాసింది. అయితే, ఆ అధికారి పేరును మాత్రం వెల్లడించలేదు. దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉద్యోగిని దేశ బహిష్కరణ చేయాలని నిర్ణయించామని విదేశాంగ శాఖ తెలిపింది. అధికార హోదాకు తగ్గట్లు ప్రవర్తించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది. 24 గంటల్లోగా సదరు అధికారి భారత్ విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.