మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ “విశ్వంభర” నుంచి మేకర్స్ విడుదల చేసిన మెగా గ్లింప్స్‌ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘బింబిసార’ విజయంతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వశిష్ట మల్లిడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఆరంభం నుంచే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

మెగాస్టార్‌ను ఇంతవరకు చూడని ఒక ఐకానిక్ లుక్‌లో చూపిస్తానని దర్శకుడు వశిష్ట ముందే హామీ ఇవ్వగా, తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆ హైప్‌ను నిలబెట్టాయి.

అయితే, గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌లో గ్రాఫిక్స్ బలహీనంగా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తగా, ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ మాత్రం ఆ అభిప్రాయాలన్నింటినీ తుడిచిపెట్టేసేలా ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పోల్చితే తాజా గ్లింప్స్‌లో విపరీతమైన తేడా స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు, అభిమానులు అంటున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్‌లో క్వాలిటీని అవుట్‌పుట్ కోసం టీం అదనపు టైమ్ తీసుకోవ‌డం ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రమోషన్లు పెరిగితే సినిమా మీద హైప్ మరింత రెట్టింపు అవుతుందని స్పష్టమవుతోంది.

రిలీజ్ ప్లాన్..

ఈ సినిమాను సంక్రాంతి 2025కి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్‌లోని విజువల్ ఎఫెక్ట్స్ & గ్రాఫిక్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో పరిస్థితి మారిపోయింది.

ఆ నెగటివ్ బజ్ తగ్గించేందుకు టీమ్ మళ్లీ VFX పనులపై ఫోకస్ పెట్టడంతో రిలీజ్ వాయిదా పడింది. తరువాత సమ్మర్ 2025లో రిలీజ్ చేయాలని భావించినా, పనులు పూర్తికాకపోవడంతో అది కూడా సాధ్యం కాలేదు.

ఇక‌ తాజాగా విడుదలైన గ్లింప్స్‌తో, “విశ్వంభర” సమ్మర్ 2026లో రిలీజ్ కానుందని అధికారికంగా కన్‌ఫామ్ చేశారు. బెస్ట్ క్వాలిటీ విజువల్స్ ఇవ్వడమే తమ లక్ష్యమని, అందుకే ఆలస్యం జరుగుతోందని మేకర్స్ స్పష్టంచేశారు. ఈ సినిమా పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చేలా తెరకెక్కుతోందని ధీమా వ్యక్తం చేశారు.

ఇక మరోవైపు, చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం మాత్రం సంక్రాంతి 2026కు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply