మహిళల ముక్కోణపు వన్డే సిరీస్లో భారత్ మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈరోజు (బుధవారం) దక్షిణాఫ్రికాతో జరిగిన హోరాహోరీ మ్యాచ్లో టీమిండియా 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ట్రై నేషన్ సిరీస్లో ఫైనల్కు దూసుకెళ్లింది.
ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లు ఆడిన హర్మన్ సేన.. మూడు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలవగా.. ఆతిథ్య శ్రీలంక మూడు మ్యాచ్లు ఆడి రెండిట్లో నెగ్గింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో ఉంది.
మరోవైపు సఫారీ అమ్మాయిలు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు. ఇక శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య రేపు (శుక్రవారం) నామమాత్రపు చివరి లీగ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం భారత్, శ్రీలంక మధ్య ఆదివారం కొలంబోలో టైటిల్ ఫైట్ జరుగుతోంది.
కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమిండియా.. నిర్ణీత ఓవర్లలో 337/9 స్కోరు నమోదు చేసింది. సఫారీ బౌలర్లు విజృంభించడంతో టీమిండియా ఆదిలోనే సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్ ప్రతీక రావల్ (1)తో పాటు హర్లీన డియోల్ (4)ను కూడా కోల్పోయింది. ఈ క్రమంలో దూకుడుగా ఆడిన మంధాన (51 ; 63 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని వెనుదిరిగింది.
జెమీమా రోడ్రిగ్స్ 89 బంతుల్లోనే తన రెండో వన్డే శతకం సాధించింది. ఆ కొద్ది సేపటికే దీప్తి కూడా 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా రికార్డు స్థాయిలో 300 మైలురాయిని దాటింది. ఆఖర్లో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జెమీమా 101 బంతుల్లో 123 పరుగులు చేసి ఔటవగా.. దీప్తి శర్మ కూడా 84 బంతుల్లో 93 స్కోరు చేసి వెనుదిరిగింది. అనంతరం రిచా ఘోష్ (20 ; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) సైతం బ్యాట్ ఝులిపించింది.
అనంతరం 338 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు కూడా అద్భుతంగా పోరాడారు. తజ్మిన్ బ్రిట్స్ (26), మియానే స్మిత్ (39), షాంగసే (36)లు రాణించగా.. తర్వాత అన్నెరీ డార్క్సెన్ (81; 80 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), కెప్టెన్ చోలె ట్రైయాన్ (67; 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
దీంతో సఫారీ జట్టు వేగంగా లక్ష్యాన్ని కరిగించుకుంటూ గెలుపువైపు అడుగులు వేసింది. కానీ, ఆఖర్లో భారత బౌలర్లు చెలరేగడంతో.. సఫారీ జట్టు 50 ఓవర్లలో 314/7 స్కోరుకే పరిమితమై టోర్నీలో ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అమన్జోత్ కౌర్ 3 వికెట్లతో విజృంభించగా.. దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది. శ్రీ చరణీ, ప్రతీక రావల్ తలా వికెట్ దక్కించుకున్నారు.