ఖమ్మం, ఆంధ్రప్రభ : పదేళ్ల పాలన గాలికి వదిలేసి, ఇప్పుడు ఫామ్హౌస్లో పడుకున్న వారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రేలాపనలు చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఖమ్మంలో మెడికల్ కళాశాల భవన శంకుస్థాపన కార్యక్రమంలో భట్టి తో పాటు, రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వైద్య ఆరోగ్య దామోదర రాజనర్సింహం, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా భట్టి మాట్లాడుతూ… ఖమ్మం మెడికల్ కళాశాల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయటం సంతోషంగా ఉందని చెప్పారు.
ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోవాలని సీఎం వివరించారు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారని భట్టి చెప్పారు. అంతేగానీ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ఉద్యోగుల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ముందు ఉంటుందని సీఎం చెప్పారని గుర్తు చేశారు. దానిని బీఆర్ఎస్, బీజేపీ నేతలు సిలువలు పలువులు చేసి మాట్లాడుతున్నారన్నారు. రూ. ఏడు లక్షల కోట్ల అప్పుచేసిన గత పాలకులు ఏనాడూ ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు ఇవ్వలేదన్నారు. ఎన్ని అప్పులున్నా రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసినట్లే ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాపాడుకుంటామన్నారు.
ఇది పేదల ప్రభుత్వం..
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని భట్టి అన్నారు. ఈ ప్రభుత్వం దొరల కోసమో, పాలకుల కోసమో పనిచేసే ప్రభుత్వం కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య వైద్యానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం వైద్యరంగానికి రూ.5950 కోట్లు ఖర్చు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదిలో 11482 కోట్లు ఖర్చు చేసిందన్నారు. 90లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకూ లబ్ధి చేకూర్చిన వైద్యం అందించామన్నారు.
వైద్య రంగాన్ని గాడిలో పెడుతున్నాం…
గత ప్రభుత్వం గాలికొదిలేసిన వైద్య రంగాన్ని గాడిలో పెడుతున్నామని భట్టి అన్నారు. గత ప్రభుత్వం గాలికి వదిలేస్తే రాజీవ్ ఆరోగ్య శ్రీ పెండింగ్ బిల్లులను తమ ప్రభుత్వం క్లియర్ చేస్తోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటిగ్రేటేడ్ పాఠశాలల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రైతాంగానికి అండగా నిలిచి రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందజేస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేస్తున్నామని చెప్పారు.