మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
  • భారతదేశంలో మెడికవర్ 25వ ఆసుపత్రి ప్రారంభం

హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ ఆసుపత్రి ప్రారంభంతో భారత్‌లో మెడికవర్ ఆసుపత్రుల సంఖ్య 25కి చేరింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ దామోదర్ రాజనర్సింహ, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే శ్రీ నవీన్ కుమార్ యాదవ్, ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారు వేమ్ నరేందర్ రెడ్డి తదితరులు, మెడికవర్ ఆసుపత్రుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ నూతన ఆసుపత్రి దేశంలోనే అత్యంత ఎత్తైన ఆసుపత్రి భవనాలలో ఒకటిగా నిర్మించబడింది. అత్యాధునిక సదుపాయాలు, ఆధునిక వైద్య సాంకేతికతతో రూపొందించిన ఈ ఆసుపత్రిలో 550 పడకల సామర్థ్యం ఉంది. పలు ప్రత్యేక వైద్య విభాగాలలో సమగ్ర వైద్య సేవలు అందించేందుకు ఇది సిద్ధంగా ఉంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఈ ఆసుపత్రి ప్రారంభంతో మెడికవర్ ఆసుపత్రులు దేశవ్యాప్తంగా తమ సేవలను మరింత విస్తరించాయి.

ఈ ఆసుపత్రిలో ముఖ్యంగా 5 సెకన్లలో గుండె స్కాన్ పూర్తి చేసే అత్యాధునిక హార్ట్ స్కానింగ్ టెక్నాలజీని మొదటిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా 640-స్లైస్ సీటీ స్కాన్ సాంకేతికతను ఏర్పాటు చేసి మరింత స్పష్టమైన చిత్రీకరణతో వేగవంతమైన , ఖచ్చితమైన నిర్ధారణకు అవకాశం కల్పించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ దేశంలో ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా అభివృద్ధి చెందుతోంది. అత్యాధునిక వైద్య సాంకేతికతతో కూడిన ఆసుపత్రుల స్థాపన ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది,” అన్నారు.

రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉంది. ఇటువంటి ఆధునిక వైద్య సదుపాయాలు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో ఎంతో సహాయపడతాయి,” అని తెలిపారు.

మెడికవర్ ఆసుపత్రుల ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జి. అనిల్ కృష్ణ మాట్లాడుతూ, హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని ప్రారంభించామని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎ. శరత్ రెడ్డి మాట్లాడుతూ, 640-స్లైస్ సీటీ స్కాన్ , వేగవంతమైన హార్ట్ స్కానింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో ఖచ్చితమైన నిర్ధారణ చేసి రోగులకు సమయానికి చికిత్స అందించగలమన్నారు.

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. హరి కృష్ణ మాట్లాడుతూ, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా మారుతున్న నేపథ్యంలో ప్రపంచ స్థాయి వైద్య సేవల అవసరం పెరుగుతోందని, ఆ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డైరెక్టర్ డా. ఎ.ఆర్. కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, ఆధునిక వైద్య పరికరాలు , సమగ్ర వైద్య విధానాలతో ఈ ఆసుపత్రి రోగులకు వేగవంతమైన , సమర్థవంతమైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

Leave a Reply