నిజామాబాద్ ప్రతినిధి, (ఆంధ్ర ప్రభ) : నిజామాబాద్ లో నిర్వహించిన రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణా రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో వస్తున్నట్లుగా అధికారులకు అప్పటికే సమాచారం అందింది.
ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు సభా ప్రాంగణానికి కాస్త దూరంలో ఓ హెలీప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. కానీ మంత్రుల హెలికాప్టర్ను పైలెట్ అనూహ్యంగా ఏకంగా సభా ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి కారణంగా భారీగా దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేల కూలాయి. అదేవిధంగా మంత్రులకు పెను ప్రమాదం తప్పింది. పంట ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ఏర్పాటు చేసిన 150 స్టాళ్లలో కొన్ని చిందరవందరగా పడిపోయాయి.
