16 ఏళ్ల తర్వాత తొలిసారి ముందస్తురాక
రాబోయే అయిదు రోజుల్లో ఏపీ, తెలంగాణలో వర్షాలు
అప్పుడే రెండు రాష్ట్రాల్లో చల్లబడుతున్న వాతావరణం
తమ అంచనాలు తప్పాయంటున్న నిపుణులు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
కొద్ది రోజులుగా ఉగ్ర భానుడి ప్రతాపంతో అల్లాడుతున్న దేశ ప్రజలకు చల్లని కబురు అందింది.. దేశానికి అత్యధికంగా వర్షపాతానిచ్చే నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలో ప్రవేశించాయి. సాధారణం కంటే ఎనిమిది రోజుల ముందే ఈ రుతుపవనాలు దేశంలోకి వచ్చాయి. దీంతో 2009 తర్వాత దేశంలోకి రుతుపవనాలు ముందుగా ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంటే 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతు పవనాలు తమ అంచనాల కంటే ముందుగా వచ్చేశాయని నిపుణులు తెలిపారు.
చివరిసారిగా 2001, 2009లో రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. ఆ రెండేళ్లలో మే 23వ తేదీన కేరళను తాకాయి. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తాయి. అయితే.. 1918లో అత్యంత వేగంగా మే 11వ తేదీన కేరళను తాకి రికార్డు సృష్టించాయి. ఆలస్యంగా ప్రారంభమైన రికార్డు 1972లో నమోదైంది. ఆ ఏడాది రుతుపవనాలు జూన్ 18వ తేదీ నాటికి కానీ ప్రారంభం కాలేదు. గత 25ఏళ్లలో 2016లో ఆలస్యంగా రుతుపవనాలు జూన్ 9వ తేదీన కేరళలోకి ప్రవేశించాయి.

ఇక.. గతేడాది మే 30వ తేదీన, 2023లో జూన్ 8వ తేదీన, 2022లో మే 29, 2021లో జూన్ 3, 2020లో జూన్ 1, 2019లో జూన్ 8, 2018లో మే 29న నైరుతి రుతుపవనాలు దేశంలో ప్రవేశించాయి. ఈ సారి అన్నింటికంటే వేగంగా కేరళను తాకి 16 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించాయి.
దక్షిణాది రాష్ట్రాల్లో మారిన వాతావరణం
దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, దక్షిణ కర్నాటక, కొంకణ్, గోవాలో అతి భారీ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. మే 29వ తేదీ వరకు కేరళ, తీరప్రాంత కర్నాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో వీస్తాయని పేర్కొంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే ఐదు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
పశ్చిమ రాష్ట్రాల అంచనా
దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడి మే 24 ప్రారంభంలో రత్నగిరికి వాయువ్యంగా 40 కి.మీ దూరంలో కేంద్రీకృతమవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది తూర్పు వైపునకు కదిలి శనివారం రత్నగిరి, దపోలి మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. మహారాష్ట్ర తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ శుక్రవారం మధ్యాహ్నం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబయిలో మెరుపులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలో గంటకు 40- 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ గోవాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆదివారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముందు జాగ్రత్త చర్యగా నదులు, జలపాతాల నుంచి దూరంగా ఉండాలని పేర్కొంది. గత 24 గంటల్లో గోవా తీరప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల అంచనా..
మే 24న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులుతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జమ్ముకశ్మీర్, లద్ధాఖ్, పంజాబ్, హరియాణా, చండీగఢ్, రాజస్థాన్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే కొన్ని రోజుల్లో ఝార్ఖండ్ అంతటా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మే 24-26 మధ్య బంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్ గఢ్, ఒడిశా, బిహార్ లో ఉరుములు, ఈదురుగాలులుతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మధ్యప్రదేశ్, బిహార్ లో గంటకు 50-70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. అండమాన్ నికోబార్ (మే 24-26), విదర్భ, ఛత్తీస్ గఢ్ (మే 24), బిహార్ (మే 25), ఒడిశా (మే 24, మే 27-29), బంగాల్, సిక్కిం (మే 28-29) లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.