అదంపూర్ – మన సోదరులు, కూతుళ్ల సింధూరాన్ని తుడిచేస్తే.. ఉగ్రవాదుల ఇళ్లళ్లోకి దూరి మరీ చంపివేశామని, వారిని పెంచి పోషిస్తున్న దేశానికి వెన్నులో వణకు పుట్టించామన్నారు ప్రధాని మోదీ ., భారత సైన్యం ఎదురుగా నిలిచి పోరాడిందని అన్నారు. సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను మట్టిలో కలిపేసిందన్నారు. ఉగ్రవాద స్థావరాలతో పాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, భారతదేశంలోని సామాన్యుల జోలికి వచ్చినవారికి వినాశనమేనని అన్నారు. మన డ్రోన్లు, క్షిపణులను తలచుకుంటే పాక్కు నిద్రపట్టదన్నారు.
పాకిస్థాన్ ధ్వంసం చేశామని ఫేక్ ప్రచారం చేసుకుంటున్న ఆదంపూర్ ఎయిర్బేస్ను నేడు మోడీ సందర్శించారు. అక్కడి సైనికులతో మాట్లాడారు. ఈ సందర్భంగా భారత సైనికులను మోదీ అభినందించారు. అలాగే ఆపరేషన్ సింధూర్ గురించి ముచ్చటించారు. అనంతరం పాక్ డ్రోన్లను, మిస్సైల్స్ ను గాలిలోనే కుప్పకూల్చిన అక్కడ మోహరించి ఉన్న ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ ముందు నిలబడి సెల్యూట్ చేశారు మోదీ. ఈ చర్య ద్వారా, పాకిస్థాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు.
అనంతరం సైనికులనుద్దేశించి ప్రసంగిస్తూ, నేటి నుంచి పదేళ్ల తర్వాత భారత పరాక్రమం గుర్చి చర్చ వస్తే.. మీ అందరి గురించే చర్చించాల్సి ఉంటుందని, భవిష్యత్తు తరానికి మీరంతా సరికొత్త ప్రేరణగా నిలిచారని సైన్యాన్ని కొనియాడారు. ఈ వేదిక మీద నుంచి త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్కు సెల్యూట్ చేస్తున్నానని, మీ పరాక్రమం కారణంగా ఆపరేషన్ సింధూర్ గురించి యావత్ ప్రపంచం చర్చించుకుంటోందన్నారు. ఈ ఆపరేషన్లో భారత సమాజం మొత్తం మీ వెంట నిలిచిందని, భారతీయులందరి మీకోసం ప్రార్థన చేశారన్నారు.
భారతీయులందరికీ.. సైనిక బలగాలు, వారి కుటుంబాలపై కృతజ్ఞత ఉందన్నారు. భారతదేశం బుద్దుడి నేల, అలాగే గురుగోవింద్ సింగ్ నేల కూడా అని వ్యాఖ్యానించారు. అణుబాంబు హెచ్చరికలను భారత సైన్యం చిత్తు చేసిందని, ఎక్కడైనా వినిపించేది ఒక్కటే భారత్ మాతాకి జై అని అన్నారు. మీరు చరిత్ర సృష్టించారు..మీ దర్శనం కోసం నేను వచ్చానని అన్నారు.
ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం.. మన సంప్రదాయం.. మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని ఆయన అభివర్ణించారు. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ తాను సెల్యూట్ చేస్తున్నానన్నారు. వీర సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సిందూర్ నినాదం.. ప్రపంచమంతా మార్మోగుతోందని ఆయన తెలిపారు.
మన సైన్యం చేపట్టిన ఈ పరాక్రమం.. భారత్ సామర్థ్యానికి ప్రతి రూపమని పేర్కొన్నారు. భారత్ చూపిన ఈ పరాక్రమం.. త్రివిధ దళాల త్రివేణీ సంగమమని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్కు భారత వాయుసేన తన సత్తా చాటిందంటూ సైనికులపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశామని.. ఈ జయ జయ ద్వానాలు ప్రపంచమంతా విన్నదని ఆయన గుర్తు చేశారు.
భారత్ మాతాకీ జై అనేది ప్రతీ పౌరుడి నినాదమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అణు బాంబు హెచ్చరికలను సైతం చిత్తు చేశామని చెప్పారు. దేశంలోని ప్రతీ పౌరుడూ గర్వపడేలా మీరు చేశారంటూ సైనికులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. మీరందరూ చరిత్ర సృష్టించారంటూ సైనికులను ఆయన వెన్ను తట్టి ప్రోత్సహించారు. మీ కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతోందని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాడి నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని ప్రధాని మోదీ తెలిపారు. మీరు గురిచూసిన కొట్టిన దెబ్బ శత్రు స్థావరాలు మట్టిలో కలిసిపోయాయన్నారు. భారత త్రివిధ దళాలు పాక్ సైన్యాన్ని మట్టి కరిపించాయని చెప్పారు. పాక్ సైన్యానికి స్పష్టమైన సందేశం ఇచ్చామన్నారు. పాక్లో ఎక్కడైనా ప్రశాంతంగా శ్వాస తీసుకునే అవకాశం లేకుండా చేశామని వివరించారు.
మన డ్రోన్లు, మిస్సైల్స్ పాక్ భూభాగంలోకి.. చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఇంకా చెప్పాలంటే.. పాక్ సైన్యానికి నిద్ర లేని పరిస్థితి సృష్టించామన్నారు. పాక్ భూభాగంలో ఏ స్థావరాన్ని అయినా గురి చూసి కొట్టగలమని నిరూపించామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ భారత్ ఆత్మ విశ్వాసాన్ని కొత్త ప్రమాణాలు లిఖించిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
ఇక మన స్థావరాలపై దాడి చేసేందుకు పాక్ ఎంతో ప్రయత్నించిందన్నారు. కానీ పాక్ విమానాలు, మిస్సైల్స్.. మన ముందు చిత్తైపోయాయన్నారు. భారత లక్ష్మణ రేఖ ఇప్పుడు ఎంతో సురక్షితమని పేర్కొన్నారు. మళ్లీ దాడి చేస్తే భారత్ గట్టిగా జవాబిస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారు. న్యూక్లియర్ బ్లాక్మెయిల్ను భారత్ ఏ మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు..వారి వెనుకున్నవారిని..భారత్ వేర్వేరుగా చూడదని ఆయన కుండ బద్దలు కొట్టారు.
కేవలం 15 నిమిషాల్లో సరిహద్దుల ఆవల శక్తులను భగ్నం చేశామని చెప్పారు. ఇదంతా ప్రొఫెషనల్ సామర్థ్యంతోనే సాధ్యమైందని ప్రధాని మోదీ తెలిపారు. భారత్ సైన్యం దాడితో శత్రువు డీలా పడిపోయిందన్నారు. ఎప్పుడు దాడి జరిగిందో కూడా కనిపెట్టలేక పోయిందని ప్రధాని మోదీ చెప్పారు. ఎంతో కచ్చితత్వంతో ఎంతో నైపుణ్యంతో చేసిన దాడి ఇదని ఆయన గుర్తు చేశారు. పౌర విమానాలను అడ్డు పెట్టుకుని పాక్ కుయుక్తులు పన్నిందని ప్రధాని మోదీ చెప్పారు. అన్నింటిని కనిపెట్టి ప్రజలకు ఎటువంటి ప్రమాదం కలుగకుండా పాక్ సైనికి శిబిరాలపైనా, విమాన బేస్ క్యాంప్ లపై దాడి చేశామని తెలిపారు మోదీ..