ఆంధ్రప్రభ ప్రతినిధి మేడ్చల్ జిల్లా, జాన్ 13: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ (Collector) గా మిక్కిలినేని మనుచౌదరి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. పాత కలెక్టర్ గౌతం పొట్రూ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గురువారం సాయంత్రం మనుచౌదరిని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
దీంతో మిక్కిలినేని మనుచౌదరి (Mikkilineni Manuchaudari) జిల్లా కలెక్టరేట్ ఛాంబర్ లో గౌతం పొట్రూ నుంచి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ మను చౌదరి ముందుగా కీసరగుట్ట (Keesaragutta) శ్రీరామలింగేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు కొత్త కలెక్టర్ కు వేదోచ్చరణ మంత్రాలతో కలెక్టరేట్ లో పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతన కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరికి జిల్లా అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, విజయేందర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, ఆర్డీవోలు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, ఎమ్మార్వోలు, పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు. పాత కలెక్టర్ గౌతంను సత్కరించి వీడ్కోలు పలికారు.