భోపాల్ – సింధూరం సంప్రదాయకంగా వివాహ బంధానికి చిహ్నమైనప్పటికీ, ఇప్పుడు అది నారీ శక్తి జాతీయ వీరత్వానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఇది భారతీయ మహిళల ధైర్యం, శక్తి, సంకల్పాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. భారతదేశం గొప్ప సంస్కృతి కలిగిన దేశమని అంటూ మన సంప్రదాయంలో సింధూరం నారీ శక్తికి చిహ్నమన్నారు. శ్రీరాముడిని ఆరాధించడానికి హనుమంతుడు కూడా సింధూరం ఉపయోగించాడని ప్రధాని మోదీ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్ భోపాల్లో శనివారం నిర్వహించిన మహిళా శక్తీకరణ మహా సమ్మేళనంలో పాల్గొన్న ప్రధాని ముందుగా దేవి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి వేడుకలను ప్రారంభించారు.
అహల్యాబాయి అభివృద్ధి, పురోగతికి చిహ్నం..
అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవి అహల్యాబాయి దేవుని ఆరాధనకు, ప్రజల సేవకు ఎలాంటి భేదం చూపలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆమె పేదల జీవితాల్లో పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని చెప్పారు. కాశీలో సేవ చేసే అవకాశం నాకు లభించడం సంతోషకరమన్నారు. అక్కడే అహల్యాబాయి అభివృద్ధి పనులకు మొదట పునాది వేశారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఆమె మహిళలను చేనేత రంగంలో శక్తివంతం చేశారని, నీటి సంరక్షణతో రైతులు ఎక్కువ ఆదాయం పొందేలా సహాయపడ్డారని వెల్లడించారు. స్త్రీలకు కూడా ఆస్తి హక్కులు ఉండాలని, భర్తలు అకాల మరణం చెందినా కూడా తిరిగి వివాహం చేసుకోవచ్చని అహల్యా ఆ కాలంలో చెప్పారని మోదీ అన్నారు.
అహల్యాబాయి గిరిజన సమూహాల కోసం కూడా కృషి చేశారని, వారికి వ్యవసాయ భూములు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పడ్డారని ప్రధాని అన్నారు. జూనాగఢ్ నుంచి కుటుంబాలను మహేశ్వర్కు తీసుకొచ్చి, మహేశ్వరీ చీరల తయారీలో నైపుణ్యం నేర్పించారన్నారు. ఇది ఇప్పటికీ అనేక కుటుంబాలకు ఆదాయ వనరుగా ఉందని మోదీ తెలిపారు. అహల్యాబాయి అభివృద్ధి, పురోగతికి చిహ్నమని.. ప్రజలు ఇచ్చిందే మనకు సొంతమని ఆమె చెప్పారని మోదీ ప్రస్తావించారు.
మహిళల కోసం సంక్షేమ పథకాలు …
ప్రస్తుత ప్రభుత్వం నీటి సరఫరా, గ్యాస్ కనెక్షన్, విద్యుత్ సరఫరా, వైద్య సంక్షేమ పథకాల ద్వారా సమాజ పురోగతి కోసం కృషి చేస్తోందన్నారు మోదీ. గతంలో మహిళలు తమ అనారోగ్యాలను దాచుకునేవారు. తమ కుటుంబంపై భారం కాకూడదని భావించేవారు. కానీ, ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సహాయం పొందుతున్నారని మోదీ చెప్పారు. మూడు కోట్ల మహిళలను లఖ్పతి దీదీలుగా చేస్తామని తాము వాగ్దానం చేశామని, ఆ దిశగా వేగంగా పురోగమిస్తున్నామని తెలిపారు.. ఇప్పుడు వేలాది మంది మహిళలు స్వయం సహాయక బృందాలతో అనుసంధానమై ఉన్నారు.