నేటితరం యువకుల్లో, ముఖ్యంగా ”టీన్” ఏజ్లో ఉన్నవారు ”ప్రేమ” నామాన్ని రామనామ జపంలా కీర్తిస్తూ, ప్రాణాలను సైతం బలి చేసుకొంటున్నారు. తాత్కాలిక మైన మోహావేసానికి లోనై ”అదే ప్రేమ” అనుకొంటున్నారు. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు తెలిసే సరికే, ప్రేమ హిమాలయాలంత ఎత్తుకు ఎదిగి పోతుంది. కాని మంచులా కరిగి పోతుందని గుర్తించని వయసు అది. ప్రేమ అనేది మనో భావానికి సంబంధించిన విషయం. తల్లితండ్రులు పంచే ప్రేమ నిస్వార్థంగా, నిజాయితీగా ఉంటుంది. గురువు పంచే ప్రేమ వాత్సల్యంతో ఉంటుంది. మన ఇతిహాసాలు పరిశీలిస్తే, రామాయణంలో సీతాదేవిని రావణుడు అపహరించిన సమయంలో, సీత జాడ కోసం ఉద్వేగంతో వెతుకుతున్న రాముడిది ప్రేమ సత్యం.
కలి పురుషుడు నలదమయంతులను ఎన్నో ఇడుములకు గురి చేసినప్పుడు ”ప్రేమ” అనే వారథి వారిద్దరిని కలిపింది…అది నిజమైన ప్రేమ. ఇలా ఒకటి కాదు, ఎన్నో ఉపాఖ్యానాలు గోచరిస్తున్నాయి. మహాభారతంలో ఒక ఉపాఖ్యానంలో ”ప్రమధ్వర రురుల ప్రేమ కథ తెలుసుకొందాం.
భృగు వంశానికి చెందిన ప్రమతి అతని ప్రేమలో చిక్కుకొన్న అప్సరస ఘతాచిల పుత్రుడు రురుడు. ఇతను ముని శ్రేష్ఠుడు. తపస్సు నిమిత్తం అడవిలో ప్రవేశించి స్థూలకేశుడు అనే మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వర అనే కన్యను చూసాడు. ఆమె విశ్వాసుడు అనే గంధర్వ రాజుకు, మేనక అనే అప్సరసకు పుట్టినది. ఆమె సౌందర్య రాశి. గుణగణాలు మేటిగా ఉన్న ఆమెను చూసి రురుడు ప్రేమలో పడి, వివాహం చేసుకొని గృహస్థాశ్రమం స్వీకరించుటకు సిద్ధపడగా, ఒకరోజు ప్రమద్వర తన చెలికత్తెలతో ఆశ్రమం వెలుపల ఆడుతున్న సందర్భంలో, ఆమె పాదాలచే త్రొక్కబడిన సర్పం కాటు వేసింది. ఇతర పరిచారికలు కంగారుపడి ఏడుస్తూ, పరిగెత్తుతూ దూరంగా ఉన్న మహర్షులకు తెలిపారు. ఈలోగా ప్రమద్వర నేలపై పడి ప్రాణాలు విడిచింది.
ఇంతలో ఈ విషయం తెలుసుకున్న మహర్షులు దయార్ద్ర హృదయులై గౌతముడు, కణ్వుడు, కుత్సుడు, శంఖుడు విశ్వామిత్రుడు, మేఖలుడు భరద్వాజుడు, మైత్రేయుడు వంటి మహర్షులు అక్కడికి చేరి, ప్రమద్వరను చూసి, దు:ఖితులై ఉండగా, రురుడు అక్కడికి వచ్చి, విషయం తెలుసుకొని
ఉండలేక, శోకంతో కలత చెందిన మనసుతో అడవిలో ప్రవేశించి ”ఓ! దేవతలారా! బ్రాహ్మణోత్తములారా! అలసట అనేదే లేకుండా దేవతలను ఆరాధించడం, యజ్ఞాలను అనుసరించడం, వేదాలను పఠించడం, వ్రతాలను ఆచరించడం, అనే పుణ్య కార్యాలు చేసిన వాడనే అయితే నేను ఉత్తమ బ్రాహ్మణులకు, గురువులకు, భక్తుడనైతే, నేను గొప్ప తపశ్వని అయితే, నేడు నేను అమితంగా ప్రేమించే ప్రమద్వర మీ అనుగ్రహం వల్ల విష విముక్తురాలు అగు గాక! అని వేడుకొని, తనలో తాను ఇలా అనుకొంటున్నాడు.
”మహాత్ములు మహిమాన్వితమైన ఆజ్ఞ చేత గాని, విషతత్త్వాన్ని వెలువరించే మంత్ర తంత్రాలు ఉపయోగించి
కాని, విషం చేత ప్రాణాలు కోల్పోయిన ప్రమద్వరను నా కోసం తిరిగి పునర్జీవం వచ్చేటట్లు చేయరా? వారికి వాతఫ:లాన్ని, వేదాధ్యయ ఫలాన్ని, దానాల ఫలాన్ని ఇస్తాను. అని ధైర్యంతో ఉన్న రురువునకు ఆకాశం నుండి ఒక దేవదూత ఇట్లా పలికాడు.” ఆర్యా! మునీశ్వరా! ప్రాణం పోయిన వారు ఎలా పునర్జీవం పొందుతారు? అది తొలగించడం సాధ్యం కాదు. అయినా నీ బాధ చూడలేక నేను ఒక మార్గాన్ని తెలియ చేస్తాను. చేయగలిగితే చెప్పు. నీ ఆయుర్దాయంలో సగభాగం ఈమెకు ఇస్తే నీ కోరిక సిద్ధిస్తుంది” అని దేవదూత పలకగానే, రురుడు అంగీకరించాడు. తన ఆయువులోని సగ భాగం ఇవ్వగానే, ఆ సుందరి ఎంతో సౌందర్యంతో నిద్రనుండి మేల్కొన్న దాని వలె, విషం నుండి విముక్తి చెందింది. ఆ దేవదూత యముడి అనుమతితోనే
ఇలా చేసానని చెప్పి అదృశ్యం అయ్యింది. తరువాత రురుడు, ప్రమధ్వర ఇద్దరూ వివాహం చేసుకొని ప్రీతికరమైన భోగాలను అనుభవిస్తూ ఉంటారు. కాని తన భార్య మరణానికి కారణమైన సర్ప జాతిని నాశనం చేయాలని కంకణం కట్టుకొని ప్రయత్నిస్తుండగా, డుంఢుభి అనే మహర్షి చేసిన హితబోధ వల్ల విశ్రమించాడు. కాని మహాభారతం కథకు ఈ సర్ప యాగమే మూలం. ఇక్కడ మనం రురుడు ప్రేమను గమనించాలి. స్వార్థంలేని కపటం లేని ప్రేమ. ఇటువంటి ప్రేమ నేడు కనుమరుగై ఆకర్షణ, ధన ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి.
- అనంతాత్మకుల రంగారావు