ఎల్ఓసీ వద్ద ఉద్రిక్తత
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత యుద్ధ వాతావరణం
రెండు రోజులుగా కాల్పులకు పాల్పడుతున్న పాక్ సైన్యం
దీటుగా బదులిస్తున్న భారత సైన్యం
పూంచ్ జిల్లా సలోత్రి గ్రామస్థులు
ప్రధాని మోదీ అందించిన బంకర్లు సురక్షితమంటున్న గ్రామస్థులు
పూంచ్, ఆంధ్రప్రభ : పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లాలో సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్థాన్ సైనిక పోస్టులకు అత్యంత సమీపంలో ఉన్న సలోత్రి గ్రామంలో ప్రజలు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనతో వారు తమ భూగర్భ బంకర్లను శుభ్రం చేసుకుని, నిల్వలు సిద్ధం చేసుకుంటున్నారు.
భారత స్థావరాలపై పాక్ కాల్పులు
రెండు రోజులుగా పాకిస్థాన్ బలగాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయి. చిన్న ఆయుధాలతో భారత స్థావరాలపై కాల్పులకు పాల్పడుతున్నాయని, దీనికి భారత సైన్యం దీటుగా బదులిస్తోందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

బంకర్లు సిద్ధం చేసుకుంటున్న గ్రామస్థులు
ఈ నేపథ్యంలో సలోత్రి గ్రామస్థులు తమ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం నిర్మించిన బంకర్లపై ఆధారపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నిర్మించిన ఈ బంకర్లు చాలా పటిష్టంగా ఉన్నాయని, తమకు రక్షణ కల్పిస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. “సుమారు 10 అడుగుల లోతులో, బుల్లెట్ప్రూఫ్గా నిర్మించిన ఈ బంకర్లలో మాకు ఎలాంటి ప్రమాదం లేదు. మా ఇళ్లలోనే ఉంటూ సురక్షితంగా ఉన్నామంటే అందుకు మోదీ ప్రభుత్వమే కారణం. వారికి మేం కృతజ్ఞులం” అని ఓ గ్రామస్థుడు పేర్కొన్నాడు.

బంకర్లలో భద్రత
పహల్గామ్ లో ఉగ్రవాదులు అమాయకులను చంపడం పిరికిపంద చర్య అని, దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని గ్రామస్థులు అంటున్నారు. ప్రతీకార చర్యలు మొదలైతే, తమ భద్రత తాము చూసుకోవాలని, అందుకే బంకర్లను సిద్ధం చేసుకుంటున్నామని వారు తెలిపారు. గతంలో కార్గిల్ యుద్ధ సమయంలో పొరుగున ఉన్న హుందర్మాన్ గ్రామస్థులు చిన్న బంకర్లలో తలదాచుకోగా, సలోత్రి వాసులకు ఆ సౌకర్యం లేక పూంచ్ పట్టణానికి వలస వెళ్లాల్సి వచ్చేది. అయితే, ఇప్పుడు ప్రభుత్వ బంకర్ల వల్ల ఎంతటి ఘర్షణ వాతావరణంలోనైనా తమ గ్రామంలోనే సురక్షితంగా ఉండగలమన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది.