వెలగపూడి, ఆంధ్రప్రభ : అడవులు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. అమరావతి పరిధిలోని అనంతవరంలో గురువారం జరిగిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలిసి సీఎం పాల్గొన్నారు.. సభా ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ… నల్లమల అడవుల పరిరక్షణకు జీవితం అంకితం చేసిన వ్యక్తి అంకారావు అని గుర్తుచేశారు. అడవుల రక్షణ అందరి బాధ్యత అన్నారు.
క్లీన్ ఎనర్జీ తీసుకొస్తున్నాం..
అమరావతిలో కూడా రకరకాల గార్డెన్స్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. మియావాకి తరహాలో గార్డెనింగ్ ఉంటుందన్నారు. రైతులకు కుసుమ పథకంలో బోర్ వెల్ ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. పంటలు, ఇళ్లకు కరెంట్ వాడుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. కరెంట్ విషయంలో స్పష్టత ఉందని క్లీన్ ఎనర్జీ రావాలన్నారు. మరోవైపు ఈనెల 21న విశాఖలో అంతర్జాతీయ యోగా డే జరుగుతుందని, దీనికోసం ప్రధాని మోడీ వస్తున్నారని తెలిపారు.
ప్రత్యేకంగా రీసైక్లింగ్ పాలసీ..
రీసైక్లింగ్పై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రీసైక్లింగ్ అంశంలో శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రధాని మోడీ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మియావాకీ గార్డెన్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. మలేషియా, సింగపూర్, సౌత్ కొరియా, జపాన్, అమెరికాలో మియావాకీ విధానాలపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులను కోరారు.