ముందుకు రండి
అవినీతిపై పోరాడుదాం
ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ పిలుపు
ఆంధ్రప్రభ, క్రైమ్ ప్రతినిధి : సమాజ అభివృద్ధికి అవరోధంగా ఉన్న అవినీతిపై పోరాడేందుకు ముందుకు రావాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ ప్రజలకు పిలుపునచ్చారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ -2025 లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం ఉదయం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్ నెస్ వీక్ ను చేపట్టడం జరుగుతుందన్నారు. నవంబర్ రెండో తారీకు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్టణం, తిరుపతి లలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతి అనేది రెండువైపులా అంటే ఇచ్చే వారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఏదైనా అవినీతిపై మీరు ఫిర్యాదు చేయాలనుకుంటే 1064 కు కాల్ చేయవచ్చాన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు.. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మనకి చాలా సపోర్టు ఉందని తెలిపారు.
ఉత్సాహంగా ర్యాలీ
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెంజ్ సర్కిల్ బందరు రోడ్డు మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం కు చేరుకుంది. సైకిల్ ర్యాలీలో ఏసీబీ డైరెక్టర్ శ్రీమతి ఆర్. జయ లక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్సీ సుధాకర్, అడిషనల్ ఎస్సీలు మహేందర్, దిలీప్ కిరణ్, ఏసీబీ అధికారులు, యువత పాల్గొన్నారు.

